కరోనాతో.. చిందు యక్షగాన కళాకారుడు మృతి

by  |
కరోనాతో.. చిందు యక్షగాన కళాకారుడు మృతి
X

దిశ, సిద్దిపేట: చిందు యక్షగాన కళలో తనదైన ప్రతిభతో మంత్రముగ్దుల్ని చేసిన దేవదాసు సోమవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పదిరోజుల క్రితం తన తండ్రి అబ్బసాయిలు మరణించడం, ఆ సమయంలో సైతం తాను అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉండటం దేవదాసును మానసికంగా ఎంతగానో కలచివేసింది. యాక్షగాన సంప్రదాయ జానపద కళనే తన జీవన ఉపాధిగా భావించిన దేవదాసు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

అంతేకాకుండా మంత్రులు, కలెక్టర్ల చేతుల మీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. 50 ఏండ్ల వయస్సు ఉన్న దేవదాసు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిలో భాగంగా తన 4వ ఏట నుండే తాను కళారంగంలో అడుగుపెట్టాడు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా పనిచేశారు.

ఆయన ప్రతిభను మెచ్చిన ప్రభుత్వం నూతన రాష్ట్ర ఏర్పాటు తర్వాత భాష సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించారు. ఉద్యమంలో సైతం చిందు యాక్షగాన వేశధారణతో ధూం దాంలలో ప్రత్యేక ఆకర్షణగా దేవదాసు నిలిచేవాడు. పద్యాలు పాడటం, మహాభారత, రామాయణ గ్రంధాల్లోని వివిధ భాగాలను ఇతిహాసంగా మలిచి ప్రదర్శించటంలో దేవదాసు బృందానికి నాయకత్వం వహించే వాడు. ప్రస్తుతం దేవదాసుకి భార్య ఇద్దరూ కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Next Story

Most Viewed