హెల్త్‌కేర్ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్!

by  |
Flipkart
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దేశీయ హెల్త్‌కేర్ రంగంలో అడుగుపెట్టింది. శుక్రవారం కంపెనీ ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ ఫార్మాసీ, డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ సస్తాసుందర్ డాట్ కామ్‌ని నిర్వహిస్తున్న సస్తాసుందర్ మార్కెట్‌ప్లేస్‌లో మెజారిటీ వాటా కోసం ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ వినియోగదారులకు సరసరమైన ధరలకే హెల్త్‌కేర్ సేవలను అందిస్తోంది. అయితే ఈ లావాదేవీ విలువ గురించిన వివరాలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు.

ఆన్‌లైన్ హెల్త్‌కేర్ విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం ద్వారా రిలయన్స్ యాజమాన్యంలోని నెట్‌మెడ్స్, 1ఎంజీ, ఫార్మ్ఈజీ, అమెజాన్ ఫార్మసీ సహా ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న ప్రధాన ప్లాట్‌ఫామ్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ ఉండనుంది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత అనారోగ్యంతో బాధపడే వారికి అవసరమైన మందులను పంపిణీ చేసే సేవలకు భారీ గిరాకీ ఉన్న కారణంగానే ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ‘వినియోగదారులు ఇటీవల డిజిటల్ విధానానికి మారడంలోని అవకాశాలు, సౌకర్యాలను గుర్తించారు. కరోనా తర్వాత హెల్త్‌కేర్, అనుబంధ పరిశ్రమ పెద్ద ఎత్తున అవకాశాలను, డిమాండ్‌ను సృష్టించింది’ అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రవి అయ్యర్ అన్నారు.

‘సరసమైన ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ విస్తృత నెట్‌వర్క్ ద్వారా లక్షలాది వినియోగదారుల విశ్వాసం కలిగిన సస్తాసుందర్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఇరు సంస్థల కలయికతో వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, దేశీయ హెల్త్‌కేర్‌ను అభివృద్ధి చేయడంలో సహాపడేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని రవి వివరించారు. కాగా ఇటీవల రెడ్‌సీర్ సంస్థ నివేదిక ప్రకారం.. మొత్తం భారతీయ హెల్త్‌కేర్ పరిశ్రమ 2024-25 నాటికి సగటున 17 శాతం వృద్ధితో రూ.26.20 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.



Next Story