ఫ్లాష్.. ఫ్లాష్.. గాంధీ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం..

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. గాంధీ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాప్తి చెందడంతో ఆస్పత్రి ప్రాంగణంలో పొగలు వ్యాపించాయి. దీంతో రోగులు భయాందోళన చెంది పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియకపోవడంతో రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు పరిశీలించి.. రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒక గదిలోని ఎలక్ట్రికల్ బోర్డ్ లో వైర్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. రోగులకు ఇబ్బంది తలెత్తకుండా బయటకు పంపించి మంటలు అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించడంతో వారు వెంటనే అప్రమత్తమై సరఫరాను నిలిపివేశారు.

ఈ ఘటనపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రికి వచ్చి ఎలా ప్రమాదం జరిగిందనే విషయాలపై ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. గతంలో ఆస్పత్రి సిబ్బందికి మాక్ డ్రిల్ పై అవగాహన కల్పించామని, తిరిగి మరోసారి నిర్వహించి అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ప్రమాదం కారణంగా 120 మంది పేషంట్లను ఇతర వార్డుల్లోకి తరలించినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మంత్రి తలసాని ఆరా..

గాంధీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు, పాడి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన ఆయన విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కు ఆదేశించారు.


Next Story

Most Viewed