దమ్ముంటే ఆ పని చెయ్.. బండి సంజయ్‌కి హరీష్ రావు సవాల్

by  |
Minister Harish Rao
X

దిశ, జమ్మికుంట: తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నరేండ్లైనా వీణవంకలో కనీసం రూ.10 లక్షల అభివృద్ధి అయినా చేశాడా అని ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రజల కోసం ఢిల్లీ వెళ్లి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ‌ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈటల గెలిస్తే వ్యక్తిగా ఆయనకు, బీజేపీ పార్టీకి‌ లాభం అని, కానీ, గెల్లు శ్రీను గెలిస్తే హుజురాబాద్ ప్రజలకు అన్నింటా లాభం చేకూరుతుందని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి‌న ఏడేళ్లలో చేసిందేంటని ప్రశ్నించారు. నోట్లరద్దు చేసి సామాన్య జనాలను ఇబ్బందులకు గురిచేశారే తప్ప ఒక్క రూపాయి నల్లధనం బయటకు తీయలేకపోయారని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో టీఆర్ఎస్ చేసిందేమిటో లెక్కలతో సహా మొన్ననే చెప్పామని గుర్తుచేశారు. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనును గెలిపిస్తే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

Next Story

Most Viewed