రేవంత్ రెడ్డి ఇలాకాలో ‘ఆ’ డీలర్ల బ్లాక్ దందా.. ఇదేంటని ప్రశ్నిస్తే..

by  |
రేవంత్ రెడ్డి ఇలాకాలో ‘ఆ’ డీలర్ల బ్లాక్ దందా.. ఇదేంటని ప్రశ్నిస్తే..
X

దిశ, కొడంగల్ : ఫర్టిలైజర్ షాపులతో వ్యవసాయ అధికారి కుమ్మకై వ్యాపారులు డీఏపీ, యూరియా బ్లాక్ దందా నడుపుతున్నారు. ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు, ఒక్కొక్క బస్తాపై 50 రూపాయలకు పైగా పైకం వసూలు చేస్తున్నారు, వర్షాలు కురవడంతో రైతులు వరి నాట్లు వేయడం, పత్తి, కంది పంటలకు DAP, యూరియా అత్యవసరమైంది.

దీంతో, రైతులు అధిక ధరలు వెచ్చించి బ్లాక్‌లో అయినా సరే ఎరువుల బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. అందుకు విధిగా డీలర్లు డివైజ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రసీదులు అందించాల్సి ఉండగా.. డీలర్లు తెల్లకాగితాలపై చిట్టీలు వ్రాసి రైతుల చేతుల్లో పెట్టి పంపిస్తున్నారు. ఏ రైతైనా ప్రశ్నిస్తే నీకేందుకయ్యా అంటూ బుకాయిస్తున్నారు.

కొడంగల్ మండలంలో ఎరువులు (పర్టిలైజర్స్ డీలర్ల) జీరో వ్యాపారానికి వ్యవసాయ అధికారి కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు కురుస్తున్న కారణంగా ఈ సమయంలో పంటల కోసం రైతులు అధికంగా DAP, యూరియా ఎరువులను అధికంగా కొనుగోలు చేస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయించి దండుకుంటున్నారు.

ఎరువులను ఉన్న ధరకు ఇవ్వకుండా కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం ఫర్టిలైజర్స్ షాపుల యాజమానుల జీరో దందాకు పాల్పడుతున్నారు. DAP బస్తా రూ.1500, యూరియా 280 రూపాయల చొప్పున విక్రయించి రసీదు చిట్టీలపై ధరలను వేయడం లేదు. ప్రభుత్వం మరో పక్క విక్రయాలపై విధిగా రసీదులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా వారు పెడచెవిన పెడుతున్నారు.

ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారి అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎప్పుడైనా తనిఖీ చేసినా స్టాక్ రిజిష్టర్‌లను మాత్రమే పరిశీలించి చేతులు దులుపుకుంటున్నారు. ఏ రోజు ఎన్ని బ్యాగుల ఎరువులు విక్రయించారు. ఏ ధరకు విక్రయించారనే బిల్లు బుక్‌లను మేయింటేన్ చేయాల్సిన డీలర్‌లు వాటిలో రోజుకు పది మంది రైతులకు విక్రయించినట్లు రశీదులు చించీ మిగత ఎరువుల మాత్రం బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.

వ్యవసాయ అధికారులు ఇచ్చిన డివైజ్‌లో రసీదులు చించకుండానే తెల్లకాగితాలపై కాకిలెక్కలు రాస్తూ రైతుల వద్ద డబ్బులు దండుకుంటున్నారు. ప్రస్తుతం ప్రాథమిక వ్యసాయ సోసైటీలో ఎరువుల నిల్వలు లేకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయమై కొడంగల్ మండల ఏఓ బాలాజీ ప్రసాద్‌ను కలిసిన ‘దిశ’ రిపోర్టర్ వివరణ కోరగా ప్రతీ ఫర్టిలైజర్ షాపులో రూ. 1200లకే ఎరువుల బస్తాలను అందిస్తున్నారని ఏఓ ప్రసాద్ అనడం శోచనీయం.

ఈ విషయంలో దాటవేత ధోరణిని కనబరచడం గమనార్హం. రైతుల పక్షాన మాట్లాడాల్సిన వ్యవసాయ అధికారి ఫర్టిలైజర్ షాపుల వ్యాపారులకు మద్దతు తెలపడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Next Story