ఆమె మహిళా పోలీస్.. పెళ్ళి చేసుకున్న మూడు నెలలకే దారుణం

by  |
jyothi
X

దిశ, ఏపీ బ్యూరో: ఆమె సచివాలయంలో మహిళా పోలీస్. తన సచివాలయం పరిధిలో మహిళలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడి ధైర్యం చెప్తుంది. మహిళలకు ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కారం చేస్తుంది. తన వద్దే సమస్య పరిష్కారం ఉంటే ఈజీగా సాల్వ్ చేస్తుంది. లేకపోతే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ఇలా సచివాలయంలోని తన పరిధిలోని మహిళలకు అండగా నిలబడేది. రెండేళ్లలో ఎంతోమందికి ధైర్యం చెప్పిన ఆమె ధైర్యం కోల్పోయింది. ఏ కష్టమెుచ్చిందో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడింది.

పెళ్లైన మూడు నెలలకే ఉరేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం అయ్యవారిపల్లి గౌతమ్‌ నగర్‌‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయ్యవారి పల్లె గ్రామానికి చెందిన కొండరాజు, రమాదేవి దంపతుల కుమార్తె జ్యోతి శ్రీవిద్య(31). జ్యోతి శ్రీ విద్య సీతారామపురం బిట్- 2 సచివాలయంలో మహిళా పోలీస్‌‌గా విధులు నిర్వహిస్తుంది. ఆమె చెల్లలు సంగీత కూడా అదే సచివాలయంలో సర్వేయర్‌‌గా పనిచేస్తున్నారు. రోజూ అక్క చెల్లెల్లు ఇద్దరూ ఇంటి నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు.

మూడు నెలల క్రితమే పెళ్లి..

మూడు నెలల క్రితమే జ్యోతి శ్రీ విద్యకు పెళ్లయింది. వింజమూరు మండలంలోని ఊటుకూరు వీఆర్‌ఏగా పనిచేస్తున్న ప్రకాష్‌ రావుతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత కూడా శ్రీవిద్య యధావిధిగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, చెల్లి బోరున విలపిస్తున్నారు. పుట్టింటి వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కుటుంబ కలహాల వల్లే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

అందరికీ ధైర్యం చెప్తూ.. దిశ యాప్ పై అవగాహన కల్పిస్తూ.. ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడే శ్రీవిద్యకుఏ కష్టమెుచ్చిందో ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుందని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవిద్య ఆత్మహత్యతో గౌతమ్ నగర్‌లో విషాదం నెలకొంది. ఎంతో చలాకీగా ఉండే శ్రీవిద్య తమ మధ్య లేదని తెలిసే సరికి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.

Next Story

Most Viewed