రైతులకు సకాలంలో ఎరువులు: మంత్రి నిరంజన్ రెడ్డి

by  |
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు చేపట్టామన్నారు. రసాయనిక ఎరువులు వాడకం తగ్గించేలా రైతులను ప్రోత్సాహమిస్తున్నామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను కంపెనీలు ప్రతి నెలా డ్రా చేసి సకాలంలో సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయన్నారు. మార్క్ ఫెడ్ వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఎప్పుడూ సిద్దంగా ఉంచుతున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఎరువుల నిల్వ కోసం అందుబాటులో ఉన్న గోదాములు అన్నింటినీ ఉపయోగించుకోవాలని సూచించారు. వానాకాలం రాక ముందే రైల్వే ర్యాక్ పాయింట్ల నుండి డిమాండ్ కు అనుగుణంగా అన్ని జిల్లాలకు ఎరువులు పంపించాలన్నారు. కరోనా మూలంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో లోడింగ్, అన్ లోడింగ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు, ఎరువుల పై కంపెనీ యాజమాన్యాలు దృష్టి సారించాలన్నారు. ఎరువుల సరఫరా విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను అందరూ పాటించాలని చెప్పారు. నోడల్ ఏజెన్సీలు, ఎరువుల కంపెనీలు, అధికారులు వాటికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి , అగ్రోస్ ఎండీ రాములు , ఎన్ ఎఫ్ సీఎల్, క్రిబ్కో, స్పిక్, ఐపీఎల్, ఆర్ సీ ఎఫ్, సీఐఎల్, ఎన్బీసీఎల్ ఎరువుల కంపెనీల ప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed