ఆ అంశంపై ప్రభుత్వం అస్పష్టత.. రైతుల్లో ఆందోళన

by  |
ఆ అంశంపై ప్రభుత్వం అస్పష్టత.. రైతుల్లో ఆందోళన
X

దిశ, సిరిసిల్ల: ఈ యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందా? లేదా? అనే సందిగ్ధం ఇంకా వీడడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సాధ్యపడదని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి రైతులు ఎక్కువగా దొడ్డు రకం వరి సాగు చేశారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఎత్తెస్తే ఎక్కడ అమ్ముకోవాలోనని రైతులు ఇప్పటి నుంచే టెన్షన్ పడుతున్నారు.

పెరిగిన వరి సాగు..

సిరిసిల్ల జిల్లాలో ఈ యాసంగి పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మిడ్ మానేరు, నర్మాల ప్రాజెక్ట్‌ లు జలకళ సంతరించుకోవడంతో వరి పంట ఎక్కువగా సాగు చేశారు. జిల్లాలో సుమారు 1.65లక్షల ఎకరాలకు పైగా వరి పంట సాగు కాగా, సుమారు 3.81లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆందోళనలో రైతులు..

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల తర్వాత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వం వ్యాపార లావాదేవీలు నిర్వహించదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయమన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రైవేటు వ్యాపారులు, రైస్‌ మిల్లర్లకే కొనుగోలు వ్యవస్థను వదిలేస్తారా? ఎఫ్‌సీఐ నేరుగా కొంటుందా? వంటి అంశాలపై రైతులు సందిగ్ధంలో పడిపోయారు.

ఆదేశాలేమీ లేవు..!

కొనుగోలు కేంద్రాల నిర్వహణ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. కానీ ఎప్పటి లాగే తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నామని అధికారులు చెబుతున్నారు. 75 లక్షల గన్నీ బ్యాగులకు 25 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన గన్నీ బ్యాగుల కొరత ఉండదన్నారు.

అంచనాలతో ముందుకు..

కలెక్టర్‌ సూచనలతో ఇటు పౌరసరఫరాల శాఖ, సహకార శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో సుమారు 3.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. వానాకాలం సీజన్‌ వరకు రెండు వందలకు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటికీ కేంద్రాల నిర్వహణపై స్పష్టత లేకున్నా ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయశాఖ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం యాథావిధిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.


Next Story

Most Viewed