ఈపీఎఫ్ డిపాజిట్‌లపై వడ్డీ రేటు యథాతథం

by  |
ఈపీఎఫ్ డిపాజిట్‌లపై వడ్డీ రేటు యథాతథం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2020-21) సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్‌లపై వడ్డీ రేటును గతేడాది ఉన్న 8.5 శాతాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ఆదాయాలు, ఆర్థిక పరిస్థితులపై అంచనాల తర్వాత తాజా వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఆమోదించారు. అయితే, ఈ సారి వడ్డీ రేటును 8.3 శాతానికి తగ్గిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం ఉన్న వడ్డీ రేటును కొనసాగిస్తున్నట్టు బోర్డు స్పష్టం చేసింది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఈపీఎఫ్ చందాదారులు భారీగా నగదును ఉపసంహరించుకున్నారు.

ఈ క్రమంలో డిపాజిట్లు క్షీణించాయి. 2020, డిసెంబర్ నాటికి సుమారు 2 కోట్లమంది ఈపీఎఫ్ఓ వినియోగదారులు రూ. 73 వేల కోట్లను వెనక్కి తీసుకున్నారనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయి. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉండేది, ఆ సమయంలో మొత్తం రూ. 81 వేల కోట్లను చందాదారులు నగదును ఉపసంహరించుకున్నారు. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఈపీఎఫ్‌పై ఆర్థిక మంత్రి కీలక నిర్ణయం వెల్ల్లడించారు. ఉద్యోగుల వాటా ఒక సంవత్సరంలో రూ. 2.5 లక్షలు దాటితే దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధించనున్నట్టు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed