తెలంగాణలో మళ్లీ ఓట్ల పండుగ

by  |
Elections again in Telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పల్లెల్లో ఓట్ల పండుగ రానుంది. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్​లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల 3 నుంచి ఓటర్ల ముసాయిదాను విడుదల చేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి నోటిఫికేషన్​ జారీ చేశారు. ఏప్రిల్​ 3 నుంచి మొదలుకానున్న ఓటర్ల జాబితా ప్రక్రియ అదే నెల 15తో ముగియనుంది. 15న తుది జాబితాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మే నెలలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నట్లు భావిస్తున్నారు.

ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్​, మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల ఎంపీపీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్​ జిల్లా ఆదిలాబాద్​ మండల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగాల్సి ఉంది. వీటితో పాటుగా 24 ఎంపీటీసీ స్థానాలకు సైతం ఎన్నికలు జరుగాల్సి ఉంది. రాష్ట్రంలోని 20 గ్రామ పంచాయతీలకు మొత్తం స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఆదిలాబాద్​జిల్లా బేల మండలం కబాయి, మనగ్రోడు, మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మండలం నెన్నెల, మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం బండమీదిపల్లి, శంకరయ్యపల్లి తండా, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్​, వంద్రుగూడ, నల్గొండ జిల్లా నకిరేకల్​ మండం చందంపల్లి, చందుపట్ల, కడపర్తి, నెల్లిబండ, నోముల, తాటికల్​, గొల్లగూడెం, నిజామాబాద్​ జిల్లా ఇందలవాయి మండలం గంగారం తండా, తిర్మన్​పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి, వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం కోయలగూడెం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
వీటితో పాటుగా 97 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్​ స్థానాలు, దాదాపు 980 గ్రామాల్లో 1083 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

మే నెలలో ఎన్నికలు

మే నెలలో గ్రామ పంచాయతీల ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇదే నెలలో మినీ పురపోరుకు కూడా నోటిఫికేషన్​ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఒకేసారి వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఓటరు జాబితా ఫైనల్​ చేయడంతో ప్రక్రియలో అడుగు ముందుకు పడినట్టే. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల నోటిఫికేషన్​ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

ఇదీ ఓటరు జాబితా షెడ్యూల్​

ఏప్రిల్​ 3 : ఓటరు జాబితా ముసాయిదా విడుదల
ఏప్రిల్​ 6: జిల్లా స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో జకలెక్టర్ల సమావేశం
ఏప్రిల్​ 7 : మండల స్థాయిలో రాజకీయ పక్షాలతో ఎంపీడీఓల సమావేశం
ఏప్రిల్​ 4 నుంచి 8 వరకు : ఓటరు జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ
ఏప్రిల్​ 10 : ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం
ఏప్రిల్​ 12 : గ్రామాలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా జిల్లా స్థాయిల్లో ఆమోదం
ఏప్రిల్​ 15: గ్రామాలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా తుది జాబితా విడుదల


Next Story

Most Viewed