ఆసరా‌పై ఆశతో.. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు

by  |
ఆసరా‌పై ఆశతో.. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఆసరా పింఛన్ పై వృద్దులకు ఆశలు చిగురిస్తున్నాయి. వృద్ధాప్య పింఛన్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్హత వయస్సును కుదించింది. గతంలో ఉన్న 65 ఏండ్ల వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తూ దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తూన్న వారి కళ నెరేవేరే సమయం ఆసన్నమైంది. వచ్చే నెలలో లేదా ఆ తర్వాతి నెలలో హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గతంలో గ్రామ పంచాయతీలో దరఖాస్తు ఫారం అందించే వారు .. ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులను ఉచితంగా చేయాల్సి ఉన్నప్పటికీ మీ సేవా నిర్వాహకులు ఒక్కో పింఛన్ కి రూ.100 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకు డబ్బులు తీసుకోని వారివి దరఖాస్తు చేయకపోవడం‌తో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఇంటికి వచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఈ నెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ ..

2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికార టీఆర్ఎస్ వృద్ధాప్య అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదిస్తామని పేర్కొంది. ఎన్నికల హామీ మేరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు వృద్ధాప్య అర్హత వయస్సును తగ్గించాలని డిమాండ్ చేయగా అందుకనుగుణంగా అర్హత వయస్సును మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించింది. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు కేవలం సిద్దిపేట జిల్లాలో పింఛన్లు మంజూరు చేశారు. అనంతరం గత ఆగస్టు నెలలో దరఖాస్తులు స్వీకరించగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 38 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అర్హత కలిగిన వారు ఇంకా చాలా మంది ఉన్నారని మొన్నటి వరకు జరిగిన వానాకాల అసెంబ్లీ సమావేశాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులు మరోమారు అవకాశం కల్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఈ నెల 31 వరకు అవకాశం కల్పించారు. దీంతో మరిన్ని దరఖాస్తు దారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మీ సేవా కేంద్రాల దరఖాస్తులు ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక బీడి, ఇతర వృత్తి కార్మికులు, వృద్ధులకు పింఛన్ అర్హత పొందేందుకు గ్రామ పంచాయతీ ద్వారా దరఖాస్తులు స్వీకరించి గ్రామ ప్రజాప్రతినిధులే ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చే వారు. ప్రస్తుతం అర్హత వయస్సు తగ్గించి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అవకాశం కల్పించడంతో చాలా మంది వృద్ధులు మీ సేవా కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రాలు, సమీప పట్టణాల్లోకి వెళ్లి నేరుగా వృద్ధులే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసరా వస్తుందని ఆశ కొద్ది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక వచ్చే నెల నుండి దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. మీ సేవా కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తు చేయాలని చెప్పినప్పటికి ఒక్కో దరఖాస్తుకు మీ సేవా నిర్వాహకులు రూ. 100 ఫీజు వసూలు చేస్తున్నారు. దీనిపై వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వృద్ధాప్య పింఛన్ దరఖాస్తు అంశంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా .. అర్హత కలిగిన వృద్ధులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed