సంచార్ సాథీతో.. గోప్యతకు భంగమా?

by Ravi |   (  Updated:2025-12-04 00:30:33  IST  )

కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ని అన్ని ఫోన్లలో తప్పని సరిగా ఇన్‌స్టాల్ అయి ఉండేలా తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ యాప్‌తో ఫోన్ ద్వారా జరిగే సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడంతో బాటు, సకాలంలో అడ్డుకొనే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఈ యాప్ ద్వారా కొన్న

సంచార్ సాథీతో.. గోప్యతకు భంగమా?
X

కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్‌ని అన్ని ఫోన్లలో తప్పని సరిగా ఇన్‌స్టాల్ అయి ఉండేలా తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ యాప్‌తో ఫోన్ ద్వారా జరిగే సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడంతో బాటు, సకాలంలో అడ్డుకొనే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఈ యాప్ ద్వారా కొన్న ఫోన్ అసలా, నకిలీయా తెలుసుకోవడం, ఫోన్ పోతే బ్లాక్ చెయ్యడం, ఇన్‌కమింగ్ ఫోన్ కాల్స్ మోసపూరితం అని గుర్తించి హెచ్చరించే వీలుంటుందని చెప్తోంది. ఆ యాప్ ద్వారా ఏడు లక్షల ఫోన్ల ఉనికి తెలిసిందని, లక్షలాది తప్పుడు కనెక్షన్లను రద్దు చెయ్యడం జరిగిందని కనుక ఆ యాప్‌ని రానున్న కాలంలో అన్ని ఫోన్లలో తప్పనిసరి చేస్తే మేలు జరుగుతుందని చెప్తోంది. ఈ ప్రకటన వినగానే ప్రతిపక్షాలు, కొన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సంస్థలు ఆందోళన వెలిబుచ్చాయి. ఇలా ఒక యాప్‌ని ఫోన్‌లో తప్పనిసరి చెయ్యడంలో ప్రభుత్వానికి వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని అంటున్నాయి. పౌరులపై వారికి తెలియ‌కుండానే నిరంతర నిఘా కోసం ఉపయోగించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాయి. ఇది ప్రజల గోప్యతా హక్కుకి భంగకరమని, వారి వివరాలన్నీ ప్రభుత్వానికి, ఇతరులకు అందుబాటులో ఉండి దుర్వినియోగానికి దారి తీస్తాయని వారి వాదన.. గతంలో ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు పెగాసస్ యాప్ ద్వారా చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తుల సమాచారాన్ని రహస్యంగా సేకరించిన రీతిలో ఈ యాప్ ద్వారా జరగొచ్చని చెప్తున్నాయి. అయితే ప్రభుత్వం ఈ యాప్ లక్ష్యం కేవలం సైబర్ క్రైమ్ దాడుల్ని తగ్గించడం, ప్రజలకు అవగాహన పెంచడం మాత్రమే అంటుంది. అక్కర్లేదనుకుంటే ఉన్న యాప్‌ని తొలగించవచ్చని చెప్తోంది. ఏదైనా ఈ సమాచార యుగంలో సాంకే తికత రెండు వైపులా పదునున్న కత్తి. అది సక్రమంగా పని చేయాలంటే ముందు దానిపై అపోహల్ని తొలగించి, అవగాహన పెంచి ప్రజల్ని సమాయత్త పర్చాలి. బలవంతంగా రుద్దినట్లు కనబడితే అనుమానాలు పెరుగుతాయి. వాడకం తగ్గి, ఉపయోగం కూడా తగ్గిపోతుంది. ఈ యాప్‌పై ముందు అవగాహన కల్పించాలి.

-డా.డి.వి.జి. శంకరరావు

94408 36931

Next Story