ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదు

by Disha edit |
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాదు
X

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. హోదా విషయంలో వాస్తవాలు ఎందుకు ప్రజలకు వివరించడం లేదు? కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఎందుకు జరపడం లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెప్పిన మాట ప్రకారం కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రత్యేక హోదా తీసుకురావాలి లేదా ప్రత్యమ్నాయం చూసి ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి హోదా విషయం పదే పదే గుర్తు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తన దృష్టికి తీసుకుపోయి, కేంద్ర అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పమని కోరాలి.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వై‌ఎస్‌ఆర్ సీపీ రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదాను పూర్తిగా మరిచిపోయినట్టు ఉంది. ఇప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అస్పష్టంగా ఉన్న ప్రభుత్వానికి రాజధాని విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. మూడు రాజధానులంటూ తీసుకొచ్చిన బిల్లును కోర్టు మొట్టికాయలు వేయడంతో వాపస్ తీసుకుంది. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తున్నట్టు మాత్రం చెప్పడం లేదు.

దీంతో దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. గత ప్రభుత్వం నిర్మించిన అమరావతినే రాజధానిగా ఈ ప్రభుత్వం కొనసాగించి ఉంటే ఈ పాటికి రాజధాని నిర్మాణం పూర్తయి ఉండేది. గుర్తింపు వచ్చేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పరచాలనే పట్టుదలతోనే ఉంది.

హోదా ఎందుకంటే

ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కువగా సేవారంగం నుంచే ఆదాయం వస్తుంది. కానీ, రాష్ట్రం విడిపోయాకా ఏపీ ఆ ఆదాయం కోల్పోయింది. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన బిల్లులో స్పష్టం చేసింది. కానీ, ఆర్థిక సంఘం సిఫారసులు రాకపోవడంతో ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఆర్థిక సంఘం ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదనడంతో, దీనిని సాకుగా చూపుతూ కేంద్రం నిరాకరిస్తోంది. నిజానికి ఆ సిఫారసుల నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రానికి వెసులుబాటు ఉంది. జాతీయ అభివృద్ధి మండలి (నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) సిఫారసు చేస్తే చాలు.

ఈ మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు మెంబర్లుగా ఉంటారు. వీరు సిఫారసు చేస్తే రాష్ట్రానికి హోదా ఇవ్వవచ్చు. కానీ, ఒప్పుకోరు దానికి కారణం రాజకీయం. నిజానికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండాలి. మౌలిక సదుపాయాలలో వెనుకబడి ఉండాలి, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండాలి. రాష్ట్రం పర్వత ప్రాంతమై ఉండాలి లేదా ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దులు కలిగి ఉండాలి కానీ, ఇవేవీ ఆంధ్రప్రదేశ్‌కు లేవు. విభజనతో ఆర్థికపర ఇబ్బందులు తప్ప.

మన పరిస్థితి గుర్తు చేసి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవాలి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. హోదా విషయంలో వాస్తవాలు ఎందుకు ప్రజలకు వివరించడం లేదు? కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఎందుకు జరపడం లేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చెప్పిన మాట ప్రకారం కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రత్యేక హోదా తీసుకురావాలి లేదా ప్రత్యమ్నాయం చూసి ప్రజలకు చెప్పాలి.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి హోదా విషయం పదే పదే గుర్తు చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తన దృష్టికి తీసుకుపోయి, కేంద్ర అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పమని కోరాలి. దానికి కేంద్రం తలవొగ్గి హోదా ఇస్తుందా? లేదా రాష్ట్రానికి మంచి లాభం చేకూర్చే ప్రతిపాదన ఏదైనా చేస్తుందా? చూడాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం బాహాటంగా ప్రకటిస్తే. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

కనుమ ఎల్లారెడ్డి

పౌరశాస్త్ర అధ్యాపకులు

93915 23027


Next Story

Most Viewed