గూడు కోసం పోరాటాలు

by Disha edit |
గూడు కోసం పోరాటాలు
X

ఇప్పుడు ప్రభుత్వం కట్టే ఇండ్లు ఆ పట్టాదారులకు ఇవ్వాలన్నా ఇంకా 600 మంది మిగిలి ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? అన్నది ప్రభుత్వమే తేల్చాలి. నిర్మాణ పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో నగరంలో వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలను బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వం వారికే కొమ్ము కాస్తోంది. అందుకే ప్రజలు సీపీఐ నాయకత్వాన తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లేకుంటే ప్రతిఘటన తప్పదు.

ద్యమాల పోరు గడ్డ వరంగల్. నేడు ఈ గడ్డ మీద గూడు కోసం పేదలు ఆరాటపడుతున్నారు. పొట్టకూటి కోసం నగరానికి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలు గూడు కోసం పోరుబాట పడుతున్నారు. అలాంటివారి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎప్పుడూ అండగా ఉంటుంది. వారి కోసం ప్రభుత్వ భూములలో ఎర్రజెండా నీడన గుడిసెలు వెలుస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో భూపోరాటాలు ఊపందుకున్నాయి. సీపీఐ నాయకత్వంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలోని వేలాది ఎకరాలలో నిరుపేదలు గుడిసెలు వేసుకుంటున్నారు.

ఇప్పటికే మడికొండ శివారులోని రాయనబండలో 31 ఎకరాలు, గుండ్ల సింగారంలో 24 ఎకరాలు, మట్టెవాడ శివారులో 16 ఎకరాలు, బుల్లి కుంటలో 20 గుంటలు, హసన్‌పర్తిలో మూడు ఎకరాలలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంది. అన్నారం పిసర్ సాగుభూమిలో 12 ఎకరాలు, వరంగల్ మట్టెవాడలో 15 ఎకరాలు 33 గుంటల భూమిలో మేడే సందర్భంగా ఎర్రజెండాలు పాతి భూ పోరాటం ప్రారంభించారు.

వాగ్దానం ఏమైనట్టు?

వరంగల్ మట్టెవాడ శివారు నిమ్మ చెరువు శిఖం భూమి అని రికార్డు లో ఉంది. కానీ, దానిని రియల్టర్లు, భూ బకాసురులు ఆక్రమించాలని చూస్తున్నారు. ఒకతను ఏకంగా ప్లాట్లు చేసి అమ్ముకోవాలని యత్నించాడు. రకరకాల పేరుతో ఇప్పటికే సగం భూమిని ఆక్రమించారు. హద్దులు పెట్టుకున్నారు. స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీ నిరుపేదలు ఎర్రజెండాలు పాతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూమి సమస్య పరిష్కారమవుతుందని పేదలు ఆశించారు.

అధికారంలోకి వచ్చిన పాలకులు పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. నేటికి ఇవ్వలేదు. పేదోడికి తలదాచుకోవడానికి 60 గజాల జాగ అడిగితే ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. బంగారు తెలంగాణలో గుడిసెలు ఉండవద్దు భవంతులు కనిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు వచ్చిన సందర్భంగా చేసిన వాగ్దానం ఏమైనట్టు? పేదోడు ఇంటి జాగా కొనాలంటే, కొన్నా కట్టించుకోవాలంటే కష్టంగా ఉంది. ఈ స్థితికి కారణం ప్రభుత్వం కాదా?

వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలు

సీఎం కేసీఆర్ గతంలో వరంగల్ నగరానికి వచ్చినప్పుడు ఎనుమాముల మార్కెట్, లక్ష్మీనగర్‌వాసులతో ముచ్చటించారు. 'మీ అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తా, గుడిసెలు లేని నగరంగా మారుస్తా' అని హామీ ఇచ్చి మరచిపోయారు. ఎనిమిదేండ్లు గడిచినా ఒక్క పేదవారికి కూడా తూర్పు నియోజకవర్గంలో ఇల్లు కట్టింది లేదు. పైగా జి ప్లస్, జె ప్లస్ పేరుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దీనిని ప్రజలు వ్యతిరేకించారు. తమ స్వాధీనంలోని భూములలో మరి కొందరిని తీసుకొచ్చి తమ నెత్తిన పెట్టవద్దని మరో ఉద్యమం నడిపారు. ఇది విజయం సాధించింది.ప్రభుత్వం తోకముడిచింది.

ప్రస్తుతం దూపకుంట ప్రభుత్వ స్థలంలో 1,400 ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. గత ప్రభుత్వం రెండు వేల మందికి పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కట్టే ఇండ్లు ఆ పట్టాదారులకు ఇవ్వాలన్నా ఇంకా 600 మంది మిగిలి ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? అన్నది ప్రభుత్వమే తేల్చాలి. నిర్మాణ పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో నగరంలో వేల ఎకరాల ప్రభుత్వ స్థలాలను బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వం వారికే కొమ్ము కాస్తోంది. అందుకే ప్రజలు సీపీఐ నాయకత్వాన తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. లేకుంటే ప్రతిఘటన తప్పదు.

మారుపాక అనిల్‌కుమార్

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు

94404 82429


Next Story

Most Viewed