శిథిలావస్థలో గడీలు

by Disha edit |
శిథిలావస్థలో గడీలు
X

గడీల ప్రభావం ముగిసాక దొరలు, జమీందారులు రాజకీయాలలోకి ప్రవేశించారు. వేములవాడ, సిరిసిల్ల గడీలు మాత్రం తమ పరిధిలోని తాలూకా గ్రామాల ప్రజలతో సత్సంబంధాలనే కొనసాగించాయి. ఎలగందుల సర్కార్ కింద సిరిసిల్ల, వేములవాడ, ఇటిక్యాల, లింగన్నపేట గడీలు జమిలిగా ఉండేవని చెబుతారు. మహారాజా కిషన్ ప్రసాద్, వీరి తాత చందూలాల్ పరిపాలనలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం స్వతంత్ర బ్రాహ్మణ అగ్రహారంగా ప్రకటించబడింది. అయితే, కుతుబ్‌షాహీల నుంచే వేములవాడ బ్రాహ్మణ అగ్రహారంగా ఉందని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. దొరలు స్థిర చరాస్తులు కోల్పోయినా ఇప్పటికీ వందలాది ఎకరాల భూములకు యజమానులుగా ఉన్నారు.

తెలంగాణ నిజాం పాలనలో ఉన్నప్పుడు దొరల గడీలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల దొరల గడీలు అయిదారు వందల సంవత్సరాల వైభవాన్ని చవి చూశాయి. నాటి చరిత్రకు చిహ్నాలుగా ఇప్పుడు మిగిలిపోయాయి. కాకతీయుల కాలంలో రేచర్ల వెలమలు, పొలవాస పద్మనాయకులు సామంతరాజ్యంగా ఒక శతాబ్దం పాలు పరిపాలించారు. ఎల్లారెడ్డిపేట బొప్పాపూర్ గ్రామంలో 18 వ శతాబ్దంలో నున్న రేచర్ల కోట (పెద్ద గడీ) ప్రస్తుతానికి శిథిలమైపోయి కొన్ని ఆనవాళ్లతో మిగిలింది. ఇది వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండేది.

సింగమ భూపాల నాయకుడు సామంత రాజుగా పరిపాలన చేసినట్లు చరిత్ర పరిశోధకుడు డా.జైశెట్టి రమణయ్య పేర్కొన్నారు. కాకతీయులు, ముసునూరి నాయకుల పాలనానంతరం, నల్లగొండ జిల్లాలోని రాచకొండ, దేవరకొండ కోటల పాలకులైన రేచర్ల పద్మనాయకులు, వెలమ ప్రభువులు తెలంగాణాపై ఆధిపత్యం వహించారు. ఈ ప్రాంతంలో వెలమ సామాజికవర్గం రాజకీయ ఆధిపత్యం మాత్రం స్వాతంత్రం నుంచి నేటి వరకు కొనసాగుతూ ఉన్నది. ఈ రాచర్ల కోట గురించి, రాజుల గురించి పెద్దగా ఆధారాలు కనిపించడం లేదు. వీటిపై ప్రత్యేక పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు.

నాటి ప్రాభవం కోల్పోయి

గ్రామాల పాలనకు ఆలవాలంగా నిలిచిన గడులను చాలా వరకు వెలమలు, రెడ్లు పాలించారు. రేచర్ల వెలమ ప్రభువులకు చెందిన చెన్నమనేని వంశస్థులు వేములవాడ, సిరిసిల్ల గడులకు యజమానులు. చెన్నమనేని వారి వేములవాడ మండలం మారుపాక, కోనరావుపేట మండలం నాగాయపల్లి గ్రామంలోని గడుల యజమానుల మధ్య సహోదర బంధం వలన ఈ గడులు సమాంతరంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పని చేశాయి. ఇవి ఎలగందుల జిల్లా పరిధిలో నైజాం రాచరికానికి అనుబంధంగా ఉండేవి. వీరు ఇంటి పన్నులు, వ్యవసాయ ఇతర శిస్తులు వసూలు చేసి, నిజాంకు చెల్లించేవారు.

గడీలలో సుంకరులు, నీరటిగాళ్లు, గుమాస్తా సిబ్బంది పని చేసేవారు. పోలీస్ వ్యవస్థ కూడా వీరి రాచరికపు అధికారానికే మద్దతు పలుకుతుండేది. కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, ఆసఫ్‌జాహీల కాలంలో గడీల పాలనా వైభవం అవిచ్ఛన్నంగా కొనసాగింది. గడీలు కాకతీయుల చివరి కాలం నుంచే ఉన్నాయని అంటారు. కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో పిండారీలు, రోహింగ్యాల దాడుల నుంచి రక్షణకు 18వ శతాబ్దం ఆరంభంలో వీటిని నిర్మించారు. ఇటుకలతో నిర్మించిన బురుజులు వంద, యాభై అడుగుల ఎత్తులో ఉండి, వాటి చుట్టూర తుపాకులు ఉపయోగించడానికి చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేసేవారు. కోటలలో ఫిరంగులను వాడే వ్యవస్థ ఉంటే, గడీలలోని బురుజులలో మాత్రం తుపాకులు ఉపయోగించే విధానం ఉండేది. ఆ చారిత్రక చిహ్నాలు నేటికీ కనిపిస్తున్నాయి.

దాష్టీకాల గురించి

గడీల ప్రభావం ముగిసాక దొరలు, జమీందారులు రాజకీయాలలోకి ప్రవేశించారు. వేములవాడ, సిరిసిల్ల గడీలు మాత్రం తమ పరిధిలోని తాలూకా గ్రామాల ప్రజలతో సత్సంబంధాలనే కొనసాగించాయి. ఎలగందుల సర్కార్ కింద సిరిసిల్ల, వేములవాడ, ఇటిక్యాల, లింగన్నపేట గడీలు జమిలిగా ఉండేవని చెబుతారు. మహారాజా కిషన్ ప్రసాద్, వీరి తాత చందూలాల్ పరిపాలనలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రం స్వతంత్ర బ్రాహ్మణ అగ్రహారంగా ప్రకటించబడింది. అయితే, కుతుబ్‌షాహీల నుంచే వేములవాడ బ్రాహ్మణ అగ్రహారంగా ఉందని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి.

దొరలు స్థిర చరాస్తులు కోల్పోయినా ఇప్పటికీ వందలాది ఎకరాల భూములకు యజమానులుగా ఉన్నారు. తెలంగాణ గడీల గురించి సంగవేని రవీంద్ర, కేవీ నరేందర్ ఒక పుస్తకమే రాశారు. ఇందులో వేములవాడ, సిరిసిల్ల గడీల చరిత్ర లేదు. 1920-48 మధ్యలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాలు జరిగినప్పుడు గడీల దొరల దాష్టీకాలు, దాడుల గురించి, మా భూమి, దాశరథి రంగాచార్యుల రచనలలో నాటి వ్యవస్థ తీరు తెన్నులు, ప్రజల తిరుగుబాటు, అరాచకాల ప్రస్తావనలు ఉన్నాయి. గడీల దొరలు ప్రజానుకూలంగా కూడా పరిపాలన చేశారని, అనేక దానాలు చేశారని రికార్డులు చెబుతున్నాయి. కొంతమంది దొరలూ, దొరసానులు కూడా రాచరిక వ్యవస్థ మీద జరిగిన ప్రజా తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన దాఖలాలను కూడా పలువురు ప్రస్తావించారు.

పురావస్తు చిహ్నాలుగా గుర్తించాలి

వేములవాడ, సిరిసిల్ల గడులు సర్దేశాయిస్థాయికి చెందిన గడీలుగా గుర్తింపు పొందాయి. వేములవాడ గడి చాలా వరకు కుంచించుకుపోయింది. గడి ఆవరణలోని భూములను అమ్ముకొన్న దొరలు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సిరిసిల్ల గడి వారసులుగా శ్రీనివాస ప్రసాదరావు, విష్ణు ప్రసాదరావు, డా.కృష్ణప్రసాదరావు వ్యవహరిస్తున్నారు. వేములవాడ గడి వారసులుగా చెన్నమనేని వెంకటరావు-లక్ష్మీ వ్యవహరిస్తున్నారు. వేములవాడ గడీల మీద 1860లో పిండారీలు దాడులు చేసి, ఆస్తులు దోచుకొని నిప్పంటించారని, రాజుల అగ్రహారిక దాన ఫర్మానాలను కూడా కాల్చివేశారని ఒక బ్రిటిష్ గెజిట్‌లో రికార్డు చేశారు.

వారసులను గడీల వివరాలు అడిగితే హైదరాబాద్ లో ఉన్న 90 ఏళ్ల వృద్ధులు మద్దూరి రాజేశ్వర్‌రావు‌గారికి తెలిసి ఉంటాయని అన్నారు. మూడు వందల ఏళ్ల దర్పానికి, మినీ రాజరికానికి సంకేతాలుగా నిలిచిన గడీల దొరల పాలన అంతరించి పోయినా, ఈ అంశాలు చరిత్ర పుటలలో సరిగా రికార్డు కావాల్సి ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. కుతుబ్‌షాహీలు, మొగలాయిలు, నిజాం ప్రభువుల కాలం నుండి ఉన్న గడీల బురుజు కట్టడాలను పురావస్తు చిహ్నాలుగా గుర్తించాలి. కబ్జాలు, కూల్చివేతలు జరగకుండా నిషేధించాలి. ఈ మేరకు దీనిని 2017 పురావస్తు (తెలంగాణ హెరిటేజ్ చట్టం, 2017) శాఖ పరిధిలోకి తేవాలని, వీటి చరిత్రలను రికార్డ్ చేయాలని చరిత్రకారులు కోరుతున్నారు.

సంకేపల్లి నాగేంద్రశర్మ

జర్నలిస్ట్, హిస్టోరియన్

కరీంనగర్, 80748 26371

Next Story

Most Viewed