బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి

by Disha edit |
బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి
X

కేంద్రం ఎప్పటి మాదిరిగానే ఈ బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రజల హక్కు అయిన 'ప్రత్యేకహోదా'కు మొండిచేయి చూపింది. విభజన హామీలను పూర్తిగా అటకెక్కించింది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాధ్యత తన బాధ్యత అని మొసలి కన్నీరు కార్చిన ప్రధాని, గత ఎనిమిదేళ్లుగా ద్రోహం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అదానీకి తాకట్టు పెట్టింది. విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటి ఊసెత్తలేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును బలపర్చుకోడానికి ఎలాంటి ప్రతిపాదన లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా వంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి నిధులూ కేటాయించలేదు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సంగతి అలాగే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల గిరిజన విశ్వవిద్యాలయాలకు 2022-23 సంవత్సర బడ్జెట్‌కన్నా 15 శాతం కోత విధించడం అమానుషం. మొత్తం 62 పేజీల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ అన్నమాటనే ఉచ్ఛరించకపోవడం దారుణం.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకు కొత్తగా ప్రత్యేక కేటాయింపులు చేసిన కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని నిర్లక్ష్యం చేసింది. నిర్వాసితులకు మొండిచేయి చూపింది. రాజధాని అభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. అమరావతికి తొంటిచేయి చూపింది. అలాగే ఉపాధి హామీ కేటాయింపుల్లో సగం కోత పెట్టడం, ఆహారం, ఎరువులపై సబ్సిడీలను ఘోరంగా కుదించడం వల్ల సామాన్యులు తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. విద్యుత్‌ సంస్కరణలు, పట్టణాల్లో యూజర్‌ ఛార్జీల వంటివి జనం నడ్డి విరుస్తాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నామమాత్రపు కేటాయింపులు చేసింది. దేశంలో 16 శాతం ఉన్న షెడ్యూల్డ్‌ కులాలకు 3.5శాతం మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. అలాగే 8.6 శాతంగా ఉన్న షెడ్యూల్‌ జాతులకు కేవలం 2.7 శాతం మాత్రమే కేటాయించారు. సబ్‌ప్లాన్‌ గురించి ప్రస్తావనే లేదు. పేద, మధ్యతరగతులకు ఈ బడ్జెట్‌ పూర్తిగా అన్యాయం చేసింది. రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్‌ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.

మేకల రవి కుమార్.

82474 79824

Next Story

Most Viewed