రాజకీయ ఖైదీలపై దౌర్జన్యమా?

by Ravi |   (  Updated:2025-10-01 00:30:35  IST  )

చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ ఆదేశాలపై, మావోయిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అండర్‌ ట్రయల్ ఖైదీలను

రాజకీయ ఖైదీలపై దౌర్జన్యమా?
X

చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ ఆదేశాలపై, మావోయిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు అండర్‌ ట్రయల్ ఖైదీలను డిప్యూటీ జైలర్ లక్ష్మణ్ బాబు, జవాన్ డి. సందీప్ తీవ్రంగా కొట్టి, అనంతరం వేర్వేరు సెల్‌లలో నిర్బంధించారు. ఈ ఘటన శనివారం జరిగింది. దాంతో ఈ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఏడుగురు అండర్‌ ట్రయల్ ఖైదీలు.. పైగా గిరిజనులు. వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. వారి వయస్సును నిర్ధారించేందుకు ఆసిఫికేషన్ పరీక్ష చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ NIA కోర్టులో దరఖాస్తు చేసింది. హిందీ తెలిసిన ఒక రాజకీయ ఖైదీ తప్ప, మిగతా ఆరుగురు ఖైదీలు కేవలం కొయ, గొండి భాషలలోనే మాట్లాడగలరు. వారిని ఒక చోట కలిపి ఉంచకుండా, వేర్వేరు సింగిల్ సెల్‌లలో నిర్బంధించి, సోలిటరీ కన్‌ఫైన్‌మెంట్‌లో పెట్టారు. కోర్టు అనుమతి లేకుండా ఇలా నిర్బంధించడం, వేధించడం చట్టపరంగా నేరం. అయినప్పటికీ, జైలు అధికారులు చట్టాన్ని అతిక్రమించి, అతీతంగా వ్యవహరిస్తున్నారు. ఆ గిరిజన ఖైదీలను డ్రైనేజీ శుభ్రపరిచే పనులు, ఇతర పనులు చేయమని బలవంతం చేశారు. చట్టం ప్రకారం ఇటువంటి పనులు అండర్‌ ట్రయల్ ఖైదీలకు అప్పగించడం నిషేధం. అయినప్పటికీ, వారు గిరిజనులు, బలహీన స్థితిలో ఉన్నారని జైలు అధికారులు వారిని ఇలా బలవంతం చేశారు. వారు తిరస్కరించగానే, జైలు అధికారులు వారిని తీవ్రంగా శారీరకంగా హింసించారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు ఒక (DLSA) జిల్లా న్యాయమూర్తి ద్వారా తక్షణమే నిర్వహించాలి. విచారణ జరిపి దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడటానికి, ప్రత్యేకంగా గిరిజన ఖైదీల భద్రతపై సంబంధిత జైలు న్యాయమూర్తి బాధ్యత వహించాలి.

– ప్రొఫెసర్ గుంటి రవి

టీజీ ఉపాధ్యక్షుడు, సివిల్ లిబర్టీస్ కమిటీ

Next Story