సింధువులే హిందువులు..

by Disha edit |
సింధువులే హిందువులు..
X

వాయువ్య భారతాన వెలసిన ప్రపంచ ఆధునిక పట్టణ నాగరికత సింధూ నాగరికత. ఆధునికతతో పాటు తమదైన ఆధ్యాత్మికతను కలిగి ఉన్నవారు సింధూ ప్రజలు, వారు మట్టితో చేయబడిన అనేక మాతృక చిహ్నాలు, పూజించిన విగ్రహాలు ఇటీవల తవ్వకాలలో బయటపడుతున్నవి. ఆర్యులైన వైదికులు వారి పశుపోషణ‌కు సంచరించే క్రమంలో సింధు పట్టణాలు ధ్వంసం చేసి సింధువులను లోబరుచుకున్నారు, అక్కడి నుండి విస్తరించే క్రమంలో మొదటగా పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఆటవికులను సంఘర్షణ సమ్మేళనం విధానంలో లోబరుచుకున్నారు. స్థానికులలో కొందరు ఆహార సేకరణ దశలో ఉండగా మరికొందరు పశుపోషణ‌ను కలిగి ఉన్నారు. అప్పటికి వీరు తమ గణం చిహ్నాలను, అమ్మ దేవతలను పూజించే విధానాన్ని కలిగి ఉన్నారు. ఆర్యులు వీరిని కలుపుకునే క్రమంలో ఆటవిక మాతృ దేవతలతో ఆర్యుల దేవుళ్ళకు వివాహాలు జరిపించి, సాంస్కృతిక సమ్మేళనానికి పూనుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్యులు ఋగ్వేద కాలంలో ప్రముఖ దేవుడు అయిన ఇంద్రున్ని వదిలి ఆటవిక పశుపోశకుల దేవుడైన కృష్ణున్ని ప్రముఖ దేవుడిగా చేసుకోవాల్సి వచ్చిందంటారు చరిత్రకారులు. క్రృష్ణుడు అప్పటికే అనేక సంచార పశుపోషణ‌ గణాలకు ఆరాధ్యదైవంగా ఉన్నాడు.

స్థానిక దేవతల బ్రాహ్మణీకరణ

అదే సమయంలో ఆర్యుల యజ్ఞయాగాలకు, బలులకు వ్యతిరేకంగా అనేక సామాజిక శక్తులు రూపొందాయి. ఇంతటి పెద్ద సమాజాన్ని లోబరుచుకోవడం, వైదిక వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడం కోసం కృష్ణుడికి ప్రాధాన్యత ఇవ్వడం, తనతో భగవద్గీత చెప్పించడం ఆర్యులకు అనివార్యం అయింది. పంజాబ్ ప్రాంతం నుండి క్రమంగా గంగా యమున నదుల తీరాన సారవంతమైన నేలలో స్థిర వ్యవసాయం ప్రవేశ పెట్టడంతో బలమైన వర్గ, వర్ణ సమాజం నిర్మాణం అయింది. అక్కడనుండి దక్షిణాదికి విస్తరించిన వైదికం వర్ణ సామ్రాజ్యాన్ని బలంగా నిర్మాణం చేసింది, అదే క్రమంలో స్థానిక దేవతలను పూర్తిగా బ్రాహ్మణీకరించారు. ఖండోబా, వీరోబా‌, విఠోబా‌, మల్లన్న, ఎల్లమ్మలు వరుసగా శివుడు, వీరభద్రుడు, విఠలుడు, మల్లికార్జునుడు, రేణుకలయ్యారు. స్థిర వ్యవసాయం ఏర్పడి మిగులు ఉత్పత్తిని కర్మకాండల పేరుతో సింధువులైన శ్రమశక్తుల నుండి దోచుకున్నారు, స్థానిక సింధూ ప్రజలంతా శూద్రులు అయ్యారు. బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, ద్విజులు అయి ప్రథమ పౌరులుగానూ, శూద్రులు ఏకజులు అయి ద్వితీయ పౌరులుగానూ జీవించాల్సి వచ్చింది.

ఈ చారిత్రక క్రమంలో శూద్రులు ఎప్పుడూ యజ్ఞయాగాలలో పాల్గొనలేదని, వైదికమతంలో భాగం కాలేదని వైదిక ధర్మ శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి, అధ్యయనం‌, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహణం బ్రాహ్మణ‌ ధర్మాలు కాగా అధ్యయనం, యజనం, దానం క్షత్రియ, వైశ్య ధర్మాలు కాగా శ్రమ‌,సేవలే శూద్రుల పవిత్ర ధర్మాలు అయినవి. ఇదే క్రమంలో శూద్రులు వైదికుల సాంస్కృతిక దాడులను ఎదుర్కుంటూ సింధూకాలం నాటి తమ ప్రత్యేక సంస్కృతిని, దేవతారాధనలను సమాంతరంగా కాపాడుకుంటూ వచ్చారు.

హిందూ దేవుళ్ళు..

సింధు వారసులు, శ్రమశక్తులు ఆరాధించే ఉత్పాదిక దేవుళ్ళే హిందూ దేవుళ్ళు. వీరి పౌరాణిక జానపద గాథలు కూడా ఉత్పత్తి, శ్రమలే ప్రధానంగా సాగుతాయి. వీరు చారిత్రికంగా అనేక దాడులనుండి, వ్యాధులనుండి ప్రజలను రక్షించిన వారు. ఎల్లలు (సరిహద్దులు) వద్ద రక్షణగా ఉన్నది ఎల్లమ్మ‌,అనేక వ్యాదుల నుండి రక్షించి పోషణ చేసింది పోశమ్మ. సిరిసంపదలు, సంతాన దేవతగా ఉన్నది ముత్యాలమ్మ. పశుసంపదను వృద్ధి చేసినవారు మల్లన్న బీరన్నలు. శాస్త్రీయంగా సౌడు మట్టి తో బట్టలు శుభ్రం చేసినవారు మడేల్. వీటంతటికి సమ్మక్క సారలమ్మలు ఆరాధ్యులు అయిన విధానం ప్రత్యక్ష సాక్ష్యం. సమక్క చెట్టు పసర్లు మూలికలతో అనేక వ్యాధులను నయం చేసేది, ఆదివాసులను కాకతీయల దాడుల నుండి రక్షించే క్రమంలో మరణించి వారికి ప్రత్యక్ష దైవం అయింది. ఇటీవల సమ్మక్క సారలమ్మను బ్రాహ్మణీకరించే కుట్రలను ఆదివాసులు సమర్ధవంతంగా అడ్డుకోగలిగారు. నేటికీ గ్రామ దేవతల ఆరాధనలో కుండలకు, కుమ్మరులకు కనిపించే ప్రాధాన్యత సింధూ కాలం నాటి ఆనవాళ్లే. సింధూ పట్టణాలు ధ్వంసం అయినప్పటికీ ప్రజలు సింధూ దేవతలను, సంస్కృతిని వీడలేదు. ఏనాడూ ఈ సింధూ వారసత్వ దేవుళ్ళ ఆరాధన చేయని వైదికులు తాము హిందువులమని చెప్పుకుంటే వారు మతం మారిన హిందువులే కానీ సనాతన హిందువులు కాలేరు.

-మధు యాదవ్ నూకల

63033 43369

Next Story

Most Viewed