ఎక్కువవుతున్న సిజేరియన్లు.. మాతృత్వం ఎటుపోతోంది?

by Ravi |   (  Updated:2025-10-10 00:30:45  IST  )

గర్భం దాల్చడం ఓ మధుర అనుభూతి. మాతృత్వం ఓ దేవుడిచ్చిన వరం. సహజ ప్రసవం ఓ అద్భుత అదృష్టం. సహజ ప్రసవంతో మాతా శిశు ఆరోగ్యాలు

ఎక్కువవుతున్న సిజేరియన్లు.. మాతృత్వం ఎటుపోతోంది?
X

గర్భం దాల్చడం ఓ మధుర అనుభూతి. మాతృత్వం ఓ దేవుడిచ్చిన వరం. సహజ ప్రసవం ఓ అద్భుత అదృష్టం. సహజ ప్రసవంతో మాతా శిశు ఆరోగ్యాలు పదిలంగా ఉంటాయి. అన్నీ తెలిసిన నడవంత్రపు నరులు తీరొక్క ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత సమాజం సహజ ప్రసవంలో ఆ వేదన పడలేమంటూ, ఆపరేషన్‌ ద్వారా అవాంఛనీయ కృత్రిమ ప్రసవాలకు మొగ్గు చూపుతున్నారు. ఇక అధిక బిల్లుల వసూలుకు ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇదే మార్గం అయింది. దీంతో క్రమంగా సహజ ప్రసవాలు తగ్గుతూ సిజేరియన్‌ ఆపరేషన్లు పెరుగుతున్నాయి. ఆధునిక ప్రసవాల్లో సహజ ప్రసవాలు అరుదై పోతున్నాయి. భారత్‌లో 2016లో 17.2 శాతం ప్రసవాలు సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా జరగగా, 2021లో అది 21.5 శాతానికి పెరగాయి. 2021లో ప్రైవేట్ ఆసుపత్రి ప్రసవాల్లో ఏకంగా 47.4 శాతం ప్రసవాలు, ప్రభుత్వ ఆసు పత్రుల్లో 14 శాతం ప్రసవాలు సిజేరియన్‌ ఆపరేషన్ల ద్వారా జరిగినట్లు లాంసెట్ అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ సూచనల ప్రకారం కేవలం 15 శాతం కన్న తక్కువగా కావలసిన సిజేరియన్‌ ప్రసవాలు నేడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక శాతం నమోదు కావడం విచారకరం. దేశంలో సిజేరియన్‌ ప్రసవాలు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 60.7 శాతం వరకు జరుగుతున్నాయని, అతి తక్కువ నాగాలాండ్‌లో 5.2% జరుగుతున్నాయి. పేదలతో పోల్చితే ధనిక వర్గాల్లో ఐదు రెట్లు అధికంగా సిజేరియన్‌ ప్రసవాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇక సహజ ప్రసావాలకు వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ సమయం, శ్రమ కేటాయించాల్సి రావడం, అదే సిజేరియన్‌‌కు గంటలో పూర్తి కావడంతో వైద్యులు ఇందుకు మొగ్గుచూపు తున్నారు. కానీ ప్రసవ సమయంలో మాతాశిశు ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చని భావించినపుడు మాత్రమే సిజేరియన్‌ ప్రసవాలను ఆశ్రయించాలి. అలా కాకుండా అనైతిక పద్ధతులు పాటిస్తే ‌తల్లి బిడ్డలకు ఆరోగ్యకరం కాదు. ప్రకృతి నియామకాలకు విరుద్ధంగా వేసే ప్రతి అడుగు అనర్థానికి దారి తీస్తుందని గమనించి సహజ ప్రసవాలకు పట్టం కడదాం, మాతాశిశు ఆయురారోగ్యాలను పొందుదాం.

-డాక్టర్‌ మధుసూదన్ రెడ్డి బుర్ర

9949700037

Next Story