స్క్రీన్‌ప్లే మన్నన్‌కు వీడ్కోలు..

by Ravi |   (  Updated:2026-06-28 01:00:30  IST  )

తమిళ సినీ రంగంలో 'స్క్రీన్‌ప్లే మన్నన్'గా గుర్తింపు పొందిన కె. భాగ్యరాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. దర్శకుడు, నటుడు, కథా రచయితగా ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆయన సాధించిన విజయాలు, తెలుగు-హిందీ చిత్రసీమలతో ఉన్న అనుబంధం, భారతీయ సినిమాకు చేసిన సేవలపై ప్రత్యేక కథనం.

స్క్రీన్‌ప్లే మన్నన్‌కు వీడ్కోలు..
X

తమిళ సినీ పరిశ్రమలో కథ చెప్పే విధానానికే కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో కె. భాగ్యరాజ్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం, నటన.. ఇలా ఒక సినిమాకు అవసరమైన దాదాపు ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేసిన అరుదైన సినీ సృష్టికర్త ఆయన. అందుకే అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనను ప్రేమగా "స్క్రీన్‌ప్లే మన్నన్" (స్క్రీన్‌ప్లే చక్రవర్తి), "వన్ మ్యాన్ స్టూడియో" అని సంబోధించే వారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడవడం దిగ్బ్రాంతికరం.

మధ్యతరగతి కుటుంబాల జీవితం, మానవ సంబంధాలు, హాస్యం, భావోద్వేగాలను సహజమైన కథనంతో ప్రేక్షకుల హృదయాలకు చేరవేసిన భాగ్యరాజ్, తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రసీమల్లోనూ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

సాధారణ జీవితాన్ని కథగా మలిచి..

దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో దర్శకుడు, నటుడు, రచయితగా ఎన్నో మైలురాళ్లు నెలకొల్పిన ఆయన భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తిత్వం. 'స్క్రీన్‌ప్లే మన్నన్'గా చిరస్థాయి గుర్తింపు పొందిన అరుదైన నటులు, దర్శకుడాయన. ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్, కథా రచయితగా, సంభాషణల రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. "పుదియ వార్పుగళ్" చిత్రంతో నటుడిగా పరిచయమై, 1979లో "సువరిల్లాధ చిత్రంగళ్" చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే తన ప్రత్యేక శైలిని చాటుకున్న ఆయన, వరుస విజయాలతో తమిళ చిత్రసీమలో అగ్ర దర్శకుడిగా ఎదిగారు. భాగ్యరాజ్ సినిమాల ప్రధాన బలం ఆయన స్క్రీన్‌ప్లే. మధ్యతరగతి కుటుంబాల జీవితం, దాంపత్య బంధాలు, ప్రేమ, అపార్థాలు, కుటుంబ సంబంధాలు వంటి సాధారణ అంశాలను ప్రేక్షకుడిని కట్టిపడేసే కథలుగా మలచడం ఆయన ప్రత్యేకత. అతిశయోక్తి పోరాటాలు, భారీ హంగులు లేకుండానే సహజత్వంతో కథను నడిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

సక్సెస్‌పుల్ దర్శకుడిగా, సహజ నటుడిగా..

కథను ప్రారంభించే తీరు, సరైన సమయంలో ఆసక్తికరమైన మలుపు ఇవ్వడం, చివరి వరకు ఉత్కంఠను కొన సాగించడం, భావోద్వేగంతో ముగించడం ఆయన దర్శకత్వ శైలికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అందుకే నేటికీ ఆయన సినిమాలు స్క్రీన్‌ప్లే నేర్చుకునే వారికి పాఠ్య గ్రంథాలుగా భావించబడుతున్నాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ భాగ్యరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సంప్రదాయ హీరోలకు భిన్నంగా, లోపాలున్నా మనసుకు దగ్గరగా ఉండే పాత్రలను పోషించారు. అమాయ కత్వం, హాస్యం, భావోద్వేగం కలగలిపిన ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమారు 75కు పైగా చిత్రాల్లో నటించడంతో పాటు, 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి అరుదైన ఘనత సాధించారు.

తెలుగు ప్రేక్షకులతోనూ ప్రత్యేక అనుబంధం..

భాగ్యరాజ్‌కు తెలుగు ప్రేక్షకులతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి, రీమేక్‌లుగా కూడా ఘనవిజయాలు సాధించాయి. అల్లరి నరేష్ నటించిన "పెళ్లయింది కానీ" చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే వెంకటేష్ నటించిన "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు", "అబ్బాయి‌గారు" వంటి చిత్రాలకు స్క్రీన్‌ ప్లే అందించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1990లలో పలు తెలుగు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.

బాలీవుడ్‌లోనూ ప్రతిభ చాటిన దర్శకుడు..

దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలోనూ భాగ్యరాజ్ ప్రతిభకు గుర్తింపు లభించింది. అమితాబ్ బచ్చన్ ద్విపా త్రాభినయంలో రూపొందిన "ఆఖ్రీ రాస్తా" చిత్రానికి దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకు‌న్నారు. భాష ఏదైనా మంచి కథకు సరిహద్దులు ఉండవని ఆయన నిరూపించారు. వ్యక్తిగత జీవితంలో ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్‌ను వివాహం చేసుకున్న భాగ్యరాజ్‌కు కుమారుడు శాంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్ ఉన్నారు. సినీ రంగంలో 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఆయనను ఘనంగా సత్కరించారు.

సినీ ప్రపంచానికి తీరని లోటు..

భారతీయ చలనచిత్ర రంగంలో, ముఖ్యంగా తమిళ చిత్రసీమలో కథ చెప్పే విధానానికే కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుల్లో కె. భాగ్యరాజ్ ఒకరు. నటుడు, దర్శకుడు, కథా రచయిత, సంభాషణల రచయిత, స్క్రీన్‌ప్లే నిపుణుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, నవలా రచయితగా ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ దక్షిణ భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించిన ఈ విలక్షణ సినీ సృష్టికర్త మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఒక గొప్ప దర్శకుడిని మాత్రమే కాదు, అసాధారణ కథకుడిని కూడా సినీ ప్రపంచం కోల్పోయింది.

శాశ్వతంగా నిలిచే వారసత్వం

కె. భాగ్యరాజ్ ఇక భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన కథలు, పాత్రలు, స్క్రీన్‌ప్లేలు, కుటుంబ కథా చిత్రాలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా నిలుస్తాయి. నేటి తరంతో పాటు రానున్న తరాల దర్శకులకు, రచయితలకు ఆయన సినిమాలు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయి. సాధారణ జీవితాన్ని అసాధారణ కథగా మలిచిన ఆ మహోన్నత సినీ సృష్టికర్తకు ఇదే నిజమైన నివాళి.

-శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story