ప్రకృతి పిలుపు:పిచ్చుకా, పిచ్చుకా కనిపించవేమి?!

by Disha edit |
ప్రకృతి పిలుపు:పిచ్చుకా, పిచ్చుకా కనిపించవేమి?!
X

పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు పిచ్చుకల మీద అవగాహన కలిగించాలి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వర్క్‌షాపులు, సెమినార్‌ల వంటివి నిర్వహించాలి. వ్యాసరచన, వక్తృత్వం, చిత్ర లేఖనం వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలి. భూమి మీద మనుషులం మాత్రమే నివసించలేము కదా! మనతో పాటు సమస్త చరాచర ప్రకృతి కూడా ఉండాలి. ప్రకృతిని అర్థం చేసుకొని జీవించడమే ప్రకృతి 'పాస్ వర్డ్' అని తెలుసుకోవాలి.

కప్పుడు పిచ్చుకలు లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాలలో ఏ వాడలో చూసినా, ఏ ఇంట చూసినా, గుంపులు గుంపులుగా ఊర పిచ్చుకలు దర్శనమిచ్చేవి. ఇవి చిన్న చిన్న పురుగులను, ధాన్యం గింజలను తింటూబతికేవి. మిగతా పక్షుల కంటే భిన్నంగా మన ఇంటి చూరులోనో, నెర్రెలువారిన గోడలోనో గూడు కట్టుకొని, మనతో కలిసి కుటుంబసభ్యుల వలె ఉండేవి. మనకు ఆహ్లాదాన్ని ఇస్తూనే, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతూ సందడి చేసేవి. తమ కిలకిలరావాలతో పల్లెకు మేల్కొలిపేవి. ఎండు పుల్లలతో నిర్మించుకున్న పిచ్చుక గూళ్లు ఎంతో ముచ్చటగా కనువిందు చేసేవి. అటువంటి పిచ్చుకలు నేడు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది.

మానవాళికి ఎంతో మేలు

గతంలో రైతులు జొన్నలు, సజ్జలు, రాగులలాంటి సంప్రదాయ పంటలు అధికంగా సాగు చేసేవారు. పక్షులకు దాణా విరివిగా దొరికేవి. దీంతో వాటి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇపుడు రైతులు వాణిజ్య పంటలకు మొగ్గు చూపడంతో ఆహారం దొరకక పిచ్చుకలు పట్టణాలకు వలస బాట పట్టాయి. అక్కడ నగరీకరణ లో భాగంగా చెట్లు నరకడం, ఖాళీ స్థలాలు లేకుండా ఉండటం, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, తలుపులు, కిటికీలు మూసి ఉంచడం, పక్షి నిలబడే చోటు లేకపోవడం, మన సౌలభ్యం కోసం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పిచ్చుకల మనుగడకు శాపంగా మారింది.

సెల్ టవర్స్ తరంగాల వలన వచ్చే రేడియేషన్‌తోపాటు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా అనేక జీవరాశుల మనుగడకు ప్రమాదం ఏర్పడుతున్నది. పక్షి జాతులు క్రమంగా అంతరిస్తున్నాయి. అలాంటి జాతులలో పిచ్చుకలు కూడా ఉన్నాయి. కాంక్రీట్ జంగల్‌గా మారిన నగరంలో పిచ్చుకలు కనిపించకపోవడం పక్షి ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది. పంట పొలాలలో హానికర పురుగులను తిని మానవాళికి మేలు చేస్తాయని, పిచ్చుకల గురించి, అవి గుడ్లు పెట్టడం దగ్గర నుంచి, పిల్లలకు రెక్కలొచ్చి ఎగిరే వరకు జాగ్రత్తగా కాపాడటం వంటివి ఈ తరానికి ఒక కథలాగా చెప్పడం తప్ప వాటితో మనకున్న అనుబంధం, ఆ అనుభూతిని వర్ణించలేని పరిస్థితి నెలకొంది.

మానవ మనుగడకు ప్రమాదం

పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ప్రమాదం భావించిన ప్రపంచ దేశాలు వాటి ఆవశ్యకతను ఇపుడిపుడే గుర్తిస్తున్నాయి. వాటి మనుగడ కొనసాగేలా, భావితరాలకు వాటి ప్రాముఖ్యత తెలిసేలా, వారిలో చైతన్యం తీసుకురావడానికి 20 మార్చి 2010 నుంచి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నాయి. పర్యావరణవేత్తలు, పక్షి ప్రియులు ఈ రోజున పిచ్చుకలపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. వాటిని రక్షించుకునే తరుణోపాయాల గురించి చర్చిస్తారు.

పిచ్చుకల అన్యోన్య జీవనాన్ని గుర్తించిన మన దేశం తపాలా బిళ్లను సైతం విడుదల చేసింది. ప్రతి జీవికి ప్రకృతి సమతుల్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ జీవజాతి జనాభా తగ్గినా ప్రకృతి పై దాని ప్రతికూల ప్రభావం కచ్చితంగా పడుతుంది. మనిషి తన స్వార్థం కోసం తోటి జీవులను పట్టించుకోకుండా ప్రవర్తిస్తే చివరకు దాని ప్రభావం మన మీద కూడా పడుతుందని గుర్తించాలి. పిచ్చుకల జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలి

ప్రతి ఇంటిలోనూ

పిచ్చుకల పరిరక్షణ కోసం ప్రతి ఇంటి ఆవరణలో పక్షి గూళ్లను తయారు చేసి వేలాడదీయాలి. కొద్ది రోజుల తరువాత అవి మెల్లమెల్లగా వాటిని ఒక నివాసంగా మార్చుకుంటాయి. గూళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, అందులో చిన్న చిప్పల వంటి వాటిలో మంచి నీరు పోసి డాబా పైన, వరండాలో ఉంచడం, చిరుధాన్యాలు, జొన్నలు, నూకలు వంటి వాటిని అక్కడక్కడ వెదజల్లడం చేయాలి. దీంతో వాటికి ఆహారం అందుతుంది. వాటి రాకను స్వాగతించిన వారమవుతాం.

పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు పిచ్చుకల మీద అవగాహన కలిగించాలి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వర్క్‌షాపులు, సెమినార్‌ల వంటివి నిర్వహించాలి. వ్యాసరచన, వక్తృత్వం, చిత్ర లేఖనం వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలి. భూమి మీద మనుషులం మాత్రమే నివసించలేము కదా! మనతో పాటు సమస్త చరాచర ప్రకృతి కూడా ఉండాలి. ప్రకృతిని అర్థం చేసుకొని జీవించడమే ప్రకృతి 'పాస్ వర్డ్' అని తెలుసుకోవాలి.

(నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం)

నరేందర్ రాచమల్ల

99892 67462


Next Story