మీ వంటి బిడ్డ ప్రజలకు అవసరమా!

by Disha edit |
మీ వంటి బిడ్డ ప్రజలకు అవసరమా!
X

టన్ నొక్కుడు బహిరంగ సభల్లో జగన్ రెడ్డి మీ బిడ్డ, మీ బిడ్డను అంటూ సంబోధించడం చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. మాకు నీ వంటి అరాచక, అవినీతి, అబద్దాల బిడ్డనే కావాల్నా నాయనా అంటున్నారు. సమాజంలో సమర్థులు, సత్యవంతుల మాటలు జనానికి రుచించడం లేదు. అబద్దాలే చెల్లుబాటు అవుతున్నాయి. అందుకే దుష్ట మానవులు వర్ధిల్లుతున్నారు. ఏ సమాజంలోనైతే నీతి తప్పినవారు విజయం సాధిస్తారో, ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో, ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో, ఎక్కడైతే అవినీతి, అరాచకం సర్వత్రా తాండవిస్తున్నా పట్టించుకోకుండా తమకు రావాల్సిన వాటా కోసం ప్రజలు అర్రులు చాస్తారో అక్కడ అవినీతి, అరాచకం, నేరాలు, ఘోరాలు వికృత రూపం దాలుస్తాయి.

నేరచరితులను, అనుభవంలేని అసమర్ధులను, అరాచకులను ఎన్నుకుంటే పరిపాలన ఇలా కాక మరెలా ఉంటుంది? సమర్ధుడు చేతికి రాయి ఇస్తే దానిని శిల్పంలా చెక్కుతాడు. అదే పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఆ రాయిని ఎవరి పైకి విసురుతాడో తెలియదు. ఆ చందంగానే జగన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన అధికారం పిచ్చోడి చేతిలో రాయి అయింది. ఇప్పుడు జగన్ రెడ్డిని జనం వద్దనుకున్నా రాష్ట్రానికి తాను చేసిన నష్టాన్ని సరిదిద్దడం సాధ్యం కాదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరైనా మంచి కార్యక్రమం చేపట్టి పరిపాలన ప్రారంభిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అద్భుతమైన, అంతర్జాతీయ సమావేశాలు జరుపుకోవడానికి కూడా అవకాశం వున్న ప్రజావేదికను రాత్రికి, రాత్రి కూల్చివేసి విధ్వంస పాలన మొదలు పెట్టారు. జగన్ రెడ్డి మూర్ఖత్వానికి, అహంకారానికి శిధిలమైన ప్రజావేదిక శిధిలాలు ఎలా కనిపిస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా అలానే శిధిలమై కనిపిస్తోంది.

ప్రజాధనాన్ని.. హారతి కర్పూరం చేసి

చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఆనవాళ్ళు, విజయ చిహ్నాలు, పథకాలు, ప్రాజెక్టులు ఇలా ప్రతి పనిని రద్దు చేసి ఇల్లు పీకి పందిరి వేసినట్లు పరిపాలన సాగించారు. మొదట ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అన్న అంశాలపై అవగాహన లేక. పరిపాలన చేతకాక, ప్రజా సమస్యలు పరిష్కరించలేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వాన్ని నడిపే విషయంలో ఒక పద్ధతి కానీ, విధానం, ఒక దశా, దిశా లేకుండా, అరాచకంగా, ఆవేశంగా, కక్ష పూరితంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్‌ని అగాధంలోకి నెట్టారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి అవినీతి బురదలో పొర్లడం తప్ప సామాన్యుడి శ్రేయస్సు పట్టించుకున్న పాపాన పోలేదు. అరకొర నగదు బదిలీతో జనం కళ్ళకు గంతలు కడుతున్నారు. అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్ నేడు అప్పుల ఊబిలోకి నెట్టారు. ఒక పక్కన బటన్ నొక్కడం, మరోపక్క మీడియాకు ప్రకటనలు గుప్పించడం తప్ప రెండవ పనిలేదు ముఖ్యమంత్రికి. ఒకే పథకానికి పదేపదే ప్రకటనలు ఇస్తూ ప్రజాధనాన్ని జగన్ సొంత మీడియాకు, ఆయన అనుకూల మీడియాకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి రూ 5,000 కోట్లు ప్రజాధనాన్ని హారతి కర్పూరం చేశారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయం, అక్రమాలు, అఘాయిత్యాలు, దురాగతాలు పరాకాష్టకు చేరాయి. జగన్మోహన్ రెడ్డి విష కౌగిలిలో చిక్కి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అన్ని వర్గాల ప్రజల జీవితాలు సమస్యల కొలిమిలో కరిగిపోతున్నాయి. విషమించిన పరిస్థితులను విషణ్ణవదనంతో పరికిస్తున్నారు ప్రజలు. రాష్ట్రంలో మహిళలపై దురాగతాలు, దళితులు, బీసీలపై, మైనార్టీలపై దాడులు, ప్రతిపక్షాలపై, జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయి. సామూహిక హత్యలు, సామూహిక అత్యాచారాలు, శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమకేసులు, అక్రమ నిర్భంధాలు, గృహనిర్భంధాలు, కక్ష సాధింపులతో నాటి జర్మనీలో నాజీల దురాగతాలను కళ్ళకు కడుతోంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారమే దళితులపై, మహిళలపై దాడులు పెరిగాయి. దళితులపై, బీసీ, మైనార్టీలపై దాడులు చేసినా, మహిళలపై దురాగతాలకు పాల్పడినా, శిరోముండనాలు చేసినా చర్యలుండవు. వేధింపుల బారినపడి కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు నెలకొన్నాయి.

ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దళిత, గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. వారు బిక్కు, బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి. ఒక పక్కన పెద్దలు,పెత్తందారులు అంటూ సుద్దులు చెబుతున్న పెద్దమనిషి పాలనలో నెలకు ముగ్గురు ఎస్సీ,ఎస్టీలు హత్యలు జరుగుతుండగా, వారానికి నలుగురు దళిత, గిరిజన మహిళలు సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ వర్గాల భద్రత గాలిలో దీపంలా మారింది. ఎస్సీ, ఎస్టీలపై 500 వరకు దాడులు, సామాజిక బహిష్కరణలు జరిగితే ఆ కేసులను నీరుకార్చారు. ఏపీలో దళితులపై 7,871 దాడులు జరిగినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు హరించివేస్తూ వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 1011 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, గిరిజనులపై దాడులు కూడా పెరిగాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ఇటీవల పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్షించకపోగా నోరు విప్పిన పాపాన పోలేదు. రాష్ట్రంలో జరుగుతున్నఘోరాలకు, నేరాలకు ముఖ్యమంత్రి తన బాధ్యత నుండి తప్పించుకోలేరు. ఎంత దారుణం అంటే తన సోదరిని ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు 10 వ తరగతి విద్యార్థినిపై దారుణంగా పట్టపగలు పెట్రోల్ పోసి తగులబెట్టినా ముఖ్యమంత్రి నోరు విప్పలేదు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు. నెల్లూరులో సామూహిక అత్యాచారం, ఏలూరులో యాసిడ్ దాడి, పులివెందులలో దళితుడి హత్య, ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేసారు. మాస్కులు అడిగిన పాపానికి సీనియర్ డాక్టర్, దళితుడైన సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి, రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి మనోవేదనతో చనిపోయేలా చేశారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వారిని కిరాతకంగా చంపేశారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వరప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లోనే గుండుకొట్టి అవమానించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశాడు. మాస్క్ పెట్టుకోలేదని మరో దళిత యువకుణ్ణి లాఠీలతో చితకబాది చంపేశారు. జగన్ రెడ్డి మాత్రం దళిత జనోద్దారకుడుగా నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ బులిపిస్తున్నారు. నాలుగేళ్లుగా వారి అభివృద్ధికి చేసింది ఏమీ లేకుండా గొప్పల డప్పు కొడుతున్నారు.

తన ప్రయోజనాలు కాపాడుకుంటూ..

అట్లాగే రాష్ట్రంలో మహిళలపై 52,587 నేరాలు జరిగాయి. మహిళల మిస్సింగ్ కేసులు 22,278, నమోదయ్యాయి. బాలికలపై యాసిడ్ దాడి ఘటనలు 9 నమోదు కాగా, 32 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. రాజ్యాంగాన్ని, దానిపై చేసిన ప్రమాణాన్ని కాలరాచి, ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను నుగ్గు,నుగ్గు చేశారు. తాత, తండ్రి వారసత్వ ఫ్యాక్షన్ రాజకీయాలను, దౌర్జ్యాన్యాలను, దోపిడీ విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ కూడా అభివృద్ధి చేస్తున్నట్లు అబద్ధాలు ప్రచారం చేయడం జగన్ రెడ్డికే సాధ్యం. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసి తన ప్రయోజనాలు కాపాడుకుంటూ రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసం తపిస్తున్నట్లు నమ్మించడం ఆయనకే సాధ్యం. జన వంచనలో జగన్ ఘనుడు. కావున ప్రజల జీవితాలు దుర్భరం అయి, ఫాసిజం పాదాల కింద నలిగిపోతున్నప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు గుండె దిటవు కావాలి.

పాలకుల దురన్యాయాల, దుర్మార్గాల, ఆపదల నుండి కాపాడమని వేడుకోవడం కాదు ఆపదలను ఎదుర్కొనే ధైర్యం నింపుకోవాలి. అకృత్యాలు, అణచివేతలు, అఘాయిత్యాలు, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా అక్రమకేసుల బనాయింపు, వేధింపులపై ప్రజలు ఎదురు తిరగాలి. ప్రజలు నోరు విప్పకపోవడం, ఎదురు తిరగని ఫలితంగానే చెడు చెలరేగిపోతుంది. ఫాసిజం రాజ్యమేలుతుంది. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొస్తున్నది. దుష్టుల, దుర్మార్గుల చర్యలను చూస్తూ ఏమీ చేయలేకపోవడం, ప్రశ్నించలేకపోవడం వల్లనే దుష్ట పాలకులు వర్ధిల్లుతున్నారు. విషమించిన పరిస్థితులను విషణ్ణ వదనంతో పరికించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై ప్రజలు దండెత్తాలి. ఫాసిస్టు పరిపాలనను ఏ మాత్రం భరించాల్సిన అవసరం లేదు.

- నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story

Most Viewed