మీ ఉప్పులో అయోడిన్​ ఉన్నదా? ఆరోగ్యశాఖ సర్వే

by  |
iodine
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్రజల్లో అయోడిన్​లోపం ఉన్నట్లు ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఆహారంలో సరైన ఉప్పు లేకపోవడం, తక్కువ అయోడిన్‌తో కలిగిన ఉప్పును తినడం వలన అయోడిన్ లోపం ఏర్పడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే మాంసహారులతో పోల్చితే శాకాహారులకే ఎక్కువ అయోడిన్ లోపం ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంటుంది. ఈక్రమంలో సదరు వ్యక్తులు వ్యాయామాలు ఎక్కువ చేస్తే మరింత లోపం వస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతోనే థైరాయిడ్​వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర కుటుంబ ఆరోగ్య సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అయోడిన్ క్యాంపులను నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. దీనిలో భాగంగా తొలి విడత రంగారెడ్డి జిల్లాలో షురూ అయింది. ఈ కార్యక్రమంలో అయోడిన్-లోపం పై అవగాహన కలిగించడంతో పాటు థైరాయిడ్​స్క్రీనింగ్‌లను నిర్వహించనున్నారు. తద్వారా వారికి సరైన చికిత్సతో పాటు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఉబ్బిన కళ్లు, పాలిపోయిన పొడి చర్మం, పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, రొమ్ము, ప్రోస్టేట్, ఇతర పునరుత్పత్తి వ్యవస్థలకు సంబంధించిన సమస్యలు, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటివి ఉన్నోళ్లందరికీ స్ర్కీనింగ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాక మెడలో వాపు, శ్వాస తీసుకోలేకపోవడం, మింగడంలో కష్టపడడం, ఊపిరాడక పోవడం వంటి సమస్యలున్నా టెస్టులు చేయనున్నారు.

Health Department Survey

ఎలా నిర్ధారిస్తారు?

మూత్ర విసర్జన అయోడిన్ పరీక్ష ద్వారా లోపాన్ని గుర్తించవచ్చు. అయోడిన్ లోపం స్పల్పంగా ఉంటే సదరు వ్యక్తుల మూత్రంలో అయోడిన్ గాఢత 50-99 ఎంసీజీ, మధ్యస్థానికి 20 నుండి 49 ఎంసీజీ, తీవ్ర అయోడిన్ లోపం ఉంటే 20 కంటే తక్కువగా ఎంసీజీ ఉంటుందని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే అయోడిన్​లోపం ఉన్నోళ్లు వీలైనంత వరకు పెరుగు, చేపలు, పాలు, తెల్ల రొట్టె, రొయ్యలు, తొక్కతో పాటుగా తెల్ల బంగాళాదుంపలు, సోయా, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి అయోడిన్ తక్కువ కలిగించే ఆహారాలను నివారించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


Next Story