శ్రీ‌వారి దర్శనం, వసతిలపై టీటీడీ కీలక ప్రకటన

by Yella Dhawani Reddy |

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది.

శ్రీ‌వారి దర్శనం, వసతిలపై టీటీడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala) దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD) కీలక ప్రకటన జారీ చేసింది. భక్తులు స్వామివారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్‌ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని దర్శనం పొందాలని సూచించారు. ఇటీవ‌ల శ్రీ‌వారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామ‌ని వనం నటరాజ నరేంద్ర కుమార్, కెఎస్.నటరాజ శర్మలు రూ.90,000 తీసుకుని మోసం చేసిన‌ట్లు హైద‌రాబాద్‌కు చెందిన వై.విశ్వనాథ్‌ టీటీడీకి ఫిర్యాదు చేశారు. వనం నటరాజ నరేంద్ర కుమార్, కె.ఎస్. నటరాజ శర్మలు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇస్తామని చెప్పి 2024 ఆగ‌స్టు 16వ తేదీ 12 మంది కోసం రూ.90,000 వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి పలు మార్లు ఫోన్ చేసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ వారు స్పందించ లేదని బాధితుడు తెలిపారు.

ఈ ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణలో సదరు నిందితులు హైదరాబాద్ జంట న‌గ‌రాల‌లో పలువురిని ఇలాగే మోసం చేస్తున్నారని, వీరిపై ఇప్పటికే దాదాపు 12 పోలీస్ కేసులు నమోదయినట్లుగా తేలింది. దీంతో నిందితులపై చర్యలు చేపట్టారు. అంతేకాదు, భక్తుల నుంచి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్‌పై టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్‌లను ఆశ్రయించి వద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించింది. టీటీడీ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించవచ్చు. అలాగే, దళారులపై అనుమానం వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులు 0877-2263828 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Next Story