టీఆర్ఎస్‌కు షాక్.. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా దళితుల ఆందోళనలు

by  |
Dalits protest
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ‘దళిత బంధు’ పథకం తీసుకొచ్చిన టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో దళితులు భారీ ర్యాలీ చేశారు. ‘దళిత బంధు’ కోసం 470 మంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు 40 మందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎంపిక చేసిన 40 మందిలోనూ స్థానికులు ఎక్కువశాతం లేదని, బయటివారు ఉన్నారని మండిపడ్డారు. విషయం తెలిసిన స్థానిక ఎంపీటీసీ భర్త ధర్నా స్థలానికి వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వస్తున్నారని అందరికీ పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.

హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యలోనూ దళితులు పెద్దఎత్తున రాస్తారోకో నిర్విహించారు. దళితబంధు అనర్హులకి కేటాయించారని ఆరోపిస్తూ కరీంనగర్-వరంగల్ జాతీయ రహాదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ‘దళిత బంధు’ అందరికీ ఒకేసారి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గ్రామంలో ఉన్న దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట నర్సింగపూర్ గ్రామ దళితులు ఆందోళన చేశారు. హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ‘దళిత బంధు’ దళితులు అందరికీ ఇవ్వాలని జాతీయ రహదారిపై బైటాయించారు. ఈ ధర్నాలో హుజురాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన ఇప్పలనర్సింగపూర్ దళితులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed