కేసీఆర్ మాస్టర్ స్కెచ్.. హుజురాబాద్ పోటీలోకి ఎవరూ ఊహించని అభ్యర్థి!

by  |
కేసీఆర్ మాస్టర్ స్కెచ్.. హుజురాబాద్ పోటీలోకి ఎవరూ ఊహించని అభ్యర్థి!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహరచన చేయడంలో అధికార టీఆర్ఎస్ పార్టీది అందె వేసిన చేయి. ఇదే తరహాలో ఎప్పటికప్పుడు స్కెచ్ వేస్తూ గ్రౌండ్ లెవల్ రిపోర్టులు తెప్పించుకుంటున్న సీఎం కేసీఆర్.. తాజాగా సరికొత్త ఆలోచనతో ఆరా తీయిస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయంగా సాగుతున్న వివరాల సేకరణతో తుది నిర్ణయం ఎలా తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు గెలిచింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. తాజాగా ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టాలంటే ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలి అన్న విషయంలో భారీగానే కసరత్తు చేస్తున్నారు. బీసీ సామాజికి వర్గానికి చెందిన ఈటలకు స్థానికంగా ఉన్న పట్టును సడలించాలంటే ఎవరూ ఉహించని విధంగా వ్యవహరిస్తే సక్సెస్ అవుతామా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థిని బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అన్న అంశంపై అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో 2,20,148 ఓటర్లు ఉండగా.. ఇందులో 45,000 మంది ఎస్సీలు ఉన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తున్న అధిష్టానం జనరల్ స్థానంలో ఎస్సీ క్యాండెట్‌ను బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అన్న సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్సీలతో పాటు ఫార్వర్డ్ క్యాస్ట్‌లో కూడా పట్టున్న ఈటలకు చెక్ పెట్టాలంటే గంపగుత్తగా ఓట్లు పడే అవకాశం ఉన్న సామాజిక వర్గాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సానుకూలత వస్తుందన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్సీ అభ్యర్థిని బరిలో నిలిపితే లాభమెంతా? నష్టమెంతా? అన్న వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రతి ఎన్నికకో వ్యూహం

రాష్ట్రంలో తిరుగులేని పట్టు సాధించడంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గ్యాడ్యుయేట్లలో ఉన్న అసంపూర్తిని అధిగమించేందుకు పకడ్బందీగా ముందుకు సాగి సక్సెస్ అయింది. హైదరాబాద్‌లో గ్రిప్ ఉన్న బీజేపీ నేత రామంచందర్‌రావును ఓడించడం టీఆర్ఎస్‌కు అసాధ్యమనే అనుకున్నారంతా..! కానీ ఎవరూ ఊహించని విధంగా విద్యాసంస్థలు నిర్వహిస్తున్న దివంగత ప్రధాని పీవీ నరసింహరావు కూతురు వాణీదేవిని అభ్యర్థిగా ఎంపిక చేసి సఫలమయ్యారు గులాబీ బాస్. ఇదే విధానంతో హుజురాబాద్‌లోనూ కొత్త పంథాలో వెళ్తే ఎలా ఉంటుంది? అని టీఆర్ఎస్ అధిష్టానం యోచిస్తోంది.

అయితే హుజూరాబాద్ ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తోందని, ప్రభుత్వాం దళితులను మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మంద కృష్ణ చేసిన ఈ ఆరోపణలు నేపథ్యంలో టీఆర్ఎస్ ఎస్సీ అభ్యర్థిని బరిలో నిలిపితే సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.

Next Story