సైక్లింగ్‌కు పెరిగిన క్రేజ్

by  |
సైక్లింగ్‌కు పెరిగిన క్రేజ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మొన్న.. సైకిలే అత్యంత కీలకమైంది. నిన్న.. అదో అక్కరకు రాని వస్తువు. లగ్జరీ వెహికిల్స్ ముందు అంతరించిపోయింది. నేడు.. అన్నింటికన్నా అదే బెటర్ పూర్వకాలంలో ప్రయాణ సాధనంగా ఉపయోగపడ్డ సైకిల్ నేటి తరానికి ఆరోగ్యాన్ని పంచేందుకు ఉపయోగపడుతోంది. యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ వారికి సైక్లింగ్ దివ్య ఔషధంగా మారిపోయింది. లగ్జరీ లైఫ్ కొనసాగిస్తున్నా సైక్లింగ్ మస్ట్ అన్నట్టుగా మారిపోయింది. హెల్త్ విషయంలో సైక్లింగ్ క్రమక్రమంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వందల్లో..

దాదాపు మూడేళ్ళ క్రితం కరీంనగర్ సిటీలో ఒకరిద్దరితో ప్రారంభం అయిన సైక్లింగ్‌ను నేడు వందలాది మంది అనుసరిస్తున్నారు. కరీంనగర్ చుట్టుపక్కల రహదారులు, లోయర్ మానేరు డ్యాం ఏరియాలో వేకువ జామునే సైకిళ్లపై సవారీ చేస్తున్నవారే కనిపిస్తున్నారు. రోజుకు 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేస్తూనే వారానికోసారి సుదూర ప్రాంతాలకు కూడా సైకిళ్లపై వెళ్లొస్తున్నారు. కరీంనగర్ రెండనీయ‌ర్స్ క్లబ్ ప్రతినిధులు ఏకంగా ఒరిస్సాకు సైకిళ్లపై వెళ్లి వచ్చారు. పారీస్‌లోని అడర్స్ క్లబ్‌కు అనుభందంగా ఉన్న అడర్స్ ఇండియా క్లబ్ ఏర్పాటు కాగా వీటితో అఫ్లియేషన్‌తో కరీంనగర్ రెండనీయ‌ర్స్ క్లబ్ నడుస్తోంది. కరీంనగర్‌కు చెందిన డాక్టర్ ఆజయ్ ఖండల్, మహేశ్ పసుల ఏర్పాటు చేసిన ఈ క్లబ్ రాష్ట్రంలో మూడోది కావడం విశేషం. ఈ క్లబ్ సభ్యులు 600 కిలోమీటర్లు సైకిళ్లపై ట్రావెల్ చేసిన వారికి పారీస్‌కు చెందిన అడర్స్ క్లబ్ నుంచి మొడల్స్ సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తున్నారు.

ఆరోగ్యం.. పర్యావరణం

కాలుష్యంతో మమేకమై జీవిస్తున్న ఈ కాలంలో షుగర్, హెవీ వెయిట్, బీపీ వంటి వ్యాధులు కామన్ అన్నట్టుగా తయారైంది. ఈ వ్యాధులను అధిగమించేందుకు నిరంతరం మెడిసిన్స్ వేసుకుంటూ కాలం వెళ్లదీయడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి తయారైంది. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం సైక్లింగ్ మాత్రమే అని చెప్పక తప్పదు. శరీరానికి వ్యాయామం ఎంతో కీలకంగా మారింది. కరోనా కట్టడి కోసం బ్రీత్ ఎక్సర్ సైజ్ కంపల్సరీ అని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు ప్రాణాయామం చేయాలని సూచించారు కూడా. అయితే సైక్లింగ్ వల్ల ఎక్సర్ సైజ్ కావడంతో పాటు శ్వాసకు సంబంధించిన వ్యాయామ ప్రక్రియ కూడా అవుతోంది. దీంతో చాలా మంది సైక్లింగ్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. సైక్లింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత కూడా బావుంటుంది. వాహన కాలుష్యాన్ని నిలువరించే అవకాశం కూడా సైక్లింగ్ తోనే సాధ్యం అంటున్నారు.

కరోనా తర్వాత..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైక్లింగ్ చేస్తే బావుటుందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. దీంతో కరీంనగర్‌కు చెందిన వందలాది మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వివిధ రంగాల్లో స్థిర పడ్డవారు, మెడికోలు పెద్ద సంఖ్యలో సైకిల్ సవారీ చేస్తున్నారు.

పెరిగిన ధరలు

ఇటీవల కాలంలో సైక్లింగ్ చేసె వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో సైకిళ్ల ధరలు పెరిగాయి. రెండేళ్ల క్రితం రూ.10 వేలు పలికిన ధర నేడు 17 వేల వరకూ పలుకుతోంది. అయితే కరోనా ప్రభావం సైకిల్ ఇండస్ట్రీపై పడడంతో మార్కెట్‌లో గేర్ సైకిళ్లతో పాటు టైర్లు ఇతరాత్ర వస్తువుల ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి.

వచ్చింది.. పోయింది..

మూడేళ్లుగా సైక్లింగ్ చేస్తున్నాను. దాదాపు20 కిలోల బరువు తగ్గాను. కరోనా వ్యాధి వచ్చి పోయిన విషయం కూడా తెలియ లేదు. తర్వాత యాంటీ బాడీ టెస్ట్ చేస్తే తెలిసింది. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ అన్ని కూడా నార్మల్ గా ఉంటున్నాయి. సైక్లింగ్ వల్ల జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది.

– మహేశ్ పసుల కరీంనగర్

ఆరోగ్య సంజీవిని

సైక్లింగ్ ఆరోగ్య సంజీవిని అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సైక్లింగ్ చేయకపోతే ఎదో వెలితిలా ఉంటుంది. మా నాన్నగారు టీచర్‌గా పనిచేశారు. ఆయన సర్వీసు అంతా కూడా సైకిల్ ప్రయాణంతోనే సాగింది. డిగ్రీవరకు నేనూ సైకిల్‌పైనే తిరిగా. ఇప్పుడు మళ్లీ సైక్లింగ్ పై దృష్టి సారించా. డయాబెటిక్ వ్యాధిని సైక్లింగ్ వల్లే పారదోలా.

– ఎస్.ఆర్ శేఖర్,కరీంనగర్


Next Story

Most Viewed