హైదరాబాద్ అడ్డాగా ఎస్పీఐ ఫేక్ కాల్ సెంటర్.. అడ్డంగా బుక్కైన ముఠా..

by  |
హైదరాబాద్ అడ్డాగా ఎస్పీఐ ఫేక్ కాల్ సెంటర్.. అడ్డంగా బుక్కైన ముఠా..
X

దిశ, శేరిలింగంపల్లి: ఎస్బీఐ బ్యాంక్ పేరుతో నకిలీ కాల్ సెంటర్ ముఠా దందా సాగిస్తోంది. అయితే సైబరాబాద్ పోలీసులు ఆ ముఠా గుట్టు రట్టు చేశారు. మోసాలకు పాల్పడుతున్న 14 మందిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన నిఖిల్ మదాన్ గత ఏడాది ఈ ఫేక్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠా డైరెక్ట్ సేల్ ఏజెన్సీ అనే థర్డ్ పార్టీ ద్వారా ఖాతాదారుల సమాచారం తీసుకుంటారు. అనంతరం ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నామని క్రెడిట్ కార్డు ఖాతాదారులను బురిడీ కొట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ కాల్ సెంటర్ నుండి దేశవ్యాప్తంగా సుమారు 33 వేల కాల్స్ చేశారని, ఆయా రాష్ట్రాల్లో 5 వేల పైన కేసులు ఉండవచ్చని సీపీ తెలిపారు. అన్ని రాష్ట్రాల పోలీసులు ఈ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారని, టెలి కాలర్స్ ద్వారా 18601801290 టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కాల్ చేస్తూ.. పాత కార్డులు రీప్లేస్ చేస్తామని, క్రెడిట్ లిమిట్ పెంచుతామని కార్డు డీటెయిల్స్ తీసుకుంటూ మోసాలు చేయడం వీరి నైజమని తెలిపారు. కాల్ సెంటర్ లో మొత్తం పదిమంది పనిచేస్తుండగా మిగతా వారు బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేస్తుంటారు. బ్రోకర్, హౌసింగ్ డాట్ కామ్ వెబ్ సైట్లలో నకిలీ లింకులు పంపుతారు.

ఇలా దేశవ్యాప్తంగా అనేక మోసాలకు పాల్పడుతున్నట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వారి వద్ద నుండి ఒక కారు, 15 బైక్ లు, 30 మొబైల్స్, లాప్ టాప్ లు సీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై 209 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిఖిల్ మదాన్, దీపాంశ్ మదాన్, పింకీ కుమారి, హితేష్ చోప్రా, రోహిత్ మాథూర్, వికాస్, సంజయ్ కుమార్, సమీర్ మిశ్రా, ప్రభాత్ కుమార్ సింగ్, సాక్షి రాజ్, అనూజ్ కుమార్, ముర్షీద్ ఆలం, గౌరవ్ బరార, ఫర్మాన్ హుస్సేన్ లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Next Story