సిమ్ స్వాపింగ్‌ ముఠాలతో జాగ్రత్త

by  |
సిమ్ స్వాపింగ్‌ ముఠాలతో జాగ్రత్త
X

దిశ, క్రైమ్ బ్యూరో : సిమ్ స్వాపింగ్ ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో గురువారం వివరాలు వెల్లడించారు. ఐటీ రిటర్న్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందుతూ, నకిలీ పత్రాలను సృష్టించి సిమ్ స్వాపింగ్‌కు పాల్పడుతున్నారని. మొబైల్ ఓటీపీ ఆధారంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిర్వహిస్తూ కంపెనీ, సంస్థల ఖాతాలను ఖాళీ చేస్తున్నారని వివరించారు.

నగరానికి చెందిన బాధితుడు 2020 జూన్ 29న తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 లక్షలు చోరీ అయినట్టుగా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు తన సిమ్ కార్డు బ్లాక్ కావడంతో కొత్త సిమ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇన్ కమింగ్ కాల్స్ ఆగిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదే తరహాలో అక్టోబర్‌లోనూ ఓ బాధితుడు తన ఖాతా నుంచి రూ.6.75 లక్షలు ఎవరో చోరీ చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో ఇదంతా సిమ్ స్వాపింగ్ మోసంగా పోలీసులు గ్రహించారు. ఇదే తరహాలో గతంలో కలకత్తా ముఠాను పట్టుకున్నారు . ఇండియాలో సిమ్ స్వాపింగ్ చేయగల ఒకే ఒకరు నైజీరియన్ జేమ్స్ ముఠా అని భావించి దర్యాప్తు ప్రారంభించారు. ముంబాయిలో కొన్ని నెలల పాటు శ్రమించి ఐదుగురిని అరెస్టు చేశారు.

మోసం చేస్తారిలా

కంపెనీలు, సంస్థలు టార్గెట్‌గా ఐటీ రిటర్న్స్ పేరుతో నైజీరియా నుంచి ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. దరఖాస్తు నింపగానే వివరాలను సేకరిస్తారు. వీటిలోని ఆధార్, పాన్ కార్డు ద్వారా తెలిసిన మొబైల్ స్టోర్ యాజమానులతో మొబైల్ నెంబర్లు తెలుసుకుంటారు. అప్పటికే బ్యాంక్ నుంచి తీసుకున్న ఫ్రూఫ్స్‌కు మోసగాళ్ల ఫోటోను యాడ్ చేసి నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేస్తారు. మొబైల్ ఫోన్ నెంబరు బ్లాక్ చేయించి, కొత్త సిమ్ కార్డులు తీసుకుంటారు. అనంతరం మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఇంటర్నెట్ బ్యాకింగ్ లేదా ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఖాతాల నుంచి డబ్బును మరో ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అనంతరం బిట్ కాయిన్ లేదా హవాలా రూపంలో నైజీరియన్‌కు డబ్బులు పంపిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మోసగాళ్లు సిమ్ స్వాపింగ్‌కు శనివారాన్ని ఎంచుకుంటున్నారు. స్వాపింగ్‌ ఒకే రోజు పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

మోసాలు చేయడంతో జేమ్స్ దిట్ట. ముంబాయిలోని చంద్రకాంత్ సిద్దార్థ్ కాంబ్లేతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. డబ్బును డ్రా చేసిన తర్వాత బిట్ కాయిన్ లేదా హవాలా రూపంలో నైజీరియాకు బదిలీ చేస్తారు. ఈ లావాదేవీలలో ముంబాయి కి చెందిన ముఠా సభ్యులకు 50 శాతం పర్సెంట్ ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. చంద్రకాంత్, జమీర్ అహ్మద్ మునీర్, ఆదిల్ హస్సన్, జునైద్ అహ్మద్, అశ్విన్ నారాయణ‌ను అరెస్టు చేశారు. వారి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, లెటర్ హెడ్స్, 7 సిమ్ కార్డులు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌తో పాటు షోయబ్ షేక్ పరారీలో ఉన్నారు.


Next Story

Most Viewed