ప్రస్తుతమైతే ఇంట్రెస్ట్ లేదు..!

by  |
ప్రస్తుతమైతే ఇంట్రెస్ట్ లేదు..!
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ తర్వాత అన్ని రకాల మార్కెట్లు బోరుమనేటట్లుగా ఉన్నాయి. షాపింగ్ అంటే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి ఐదుగురిలో నలుగురు ఇక నుంచి ఖర్చులు తగ్గించుకుంటామంటున్నారు. ఎవరికి వారు సుస్థిరత వైపు ఆసక్తి చూపిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత షాపులు తెరిచినా 67 శాతం మందిలో ఎలాంటి స్పందన లేదని రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. ‘పోస్ట్ లాక్‌డౌన్.. వినియోగదారుల సెంటిమెంట్‌’పై దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం.. లాక్‌డౌన్ తర్వాత వినియోగదారుల్లో జాగ్రత్త ఎక్కువగా కనబడింది. ప్రతి వస్తువు కొనుగోలులోనూ అవసరం ఎంతో చూసుకుంటున్నారు. మూడు నెలల తర్వాత మొదటిసారి షాపింగ్‌కు వచ్చినట్లు 62 శాతం మంది చెప్పారు. అదే ద్వితీయ శ్రేణి నగరాల్లోనైతే మొదటిసారి షాపింగ్‌కు వచ్చిన వారి సంఖ్య75 శాతంగా నమోదైంది. అలాగే 78 శాతం మంది ఖర్చులను తగ్గించుకుంటామని వెల్లడించారు. కేవలం 6 శాతం మంది మాత్రమే ఖర్చులు పెరుగుతాయన్నారు. దీన్ని బట్టి రిటెయిల్ రంగం కూడా నెమ్మదిస్తోందని స్పష్టమవుతోంది. గడిచిన మూడు నెలల్లో రాబడి జీరోగా ఉన్న రిటైల్ రంగానికి రానున్న రోజుల్లోనూ గడ్డు కాలమేనని తెలుస్తోంది.

పరిశుభ్రతపై పెరిగిన అవేర్‌నెస్

కరోనా వైరస్ నేపథ్యంలో జనంలో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. షాపింగ్‌కు వెళ్లినా జాగ్రత్తలు పాటిస్తున్నారు. సర్వేలో 75 శాతం శానిటైజేషన్‌కు ఆసక్తి చూపారు. షాపింగ్ చేసేటప్పుడు సురక్షిత మార్గాలను ఎంచుకుంటున్నారు. 57 శాతం మంది స్టాఫ్‌తో కూడా మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. 30 శాతం మంది అత్యంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వినియోగదారులు షాపింగ్ చేయడాన్ని అసహ్యించుకుంటారన్నారు. అందుకే సేఫ్టీ, హైజీన్ మెజర్ మెంట్స్ రిటెయిలర్స్ చేపట్టాలన్నారు. వినియోగదారులకు షాపింగ్ సురక్షితమేనని నిరూపించుకోకపోతే రావడానికి వెనుకడుగు వేస్తారని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమైన వస్తువులివే..

సర్వేలో అత్యంత ప్రాధాన్యత వస్తువులు నిత్యావసరాలే. ఆ తర్వాత అపెరల్, బట్టలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వినియోగదారులు వారి లైఫ్‌ స్టైల్‌ను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. డ్యూరబుల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ వస్తువుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. అలాగే రెస్టారెంట్లకు వెళ్లేందుకు కూడా నో ఇంట్రెస్ట్ అంటున్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఫర్నిచర్, జ్యువెల్లరీ, వాచీలు, వ్యక్తిగత వస్తువులను కొనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. 75 శాతం మంది ఆఫ్ లైన్‌లో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. 45 ఏండ్లకు పైబడిన వారిలోనూ 67 శాతం మంది ఆన్‌లైన్, ఆఫ్ లైన్ కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. సర్వేలో 4,239 మంది పాల్గొన్నారు. వారిలో 73 శాతం పురుషులు, 27 శాతం మంది మహిళలు ఉన్నారు. మూడింట రెండొంతుల మంది 25 నుంచి 44 ఏండ్ల వయసు వారే. 80 శాతం ప్రధాన నగరాలకు చెందినవారే. మిగిలిన వారు ద్వితీయ శ్రేణి నగరాలకు చెందినవారుగా సంస్థ వెల్లడించింది.

సర్వేలోని అంశాలు

1. టాప్ 5 కొనుగోలు వస్తువులు : ఫుడ్, నిత్యావసరాలు-52 శాతం, డ్యూరబుల్, ఎలక్ట్రానిక్స్-31 శాతం, బ్యూటీ, వెల్ నెస్, పర్సనల్ కేర్: 25 శాతం, ఫుట్‌వేర్ : 24 శాతం
2. టాప్ 5 సేఫ్ షాపింగ్ : స్టోర్ శానిటైజేషన్-75 శాతం, టెంపరేచర్ పరిశీలించే స్టాఫ్ : 67 శాతం, స్టాఫ్‌తో తక్కువగా మాట్లాడడం : 57 శాతం, సీల్డ్ ప్రొడక్టులు : 48 శాతం, హోం డెలివరీ : 43 శాతం
3. ఆఫ్‌లైన్ కొనుగోలు: 64 శాతం మంది పురుషులు, 60 శాతం మహిళలు
4. షాపింగ్ తగ్గుదల: 41 శాతం మంది తగ్గిస్తామంటున్నారు.


Next Story