ప్రధాని మోడీ ఆందోళన.. అంతా వారి కోసమే..

by  |
ప్రధాని మోడీ ఆందోళన.. అంతా వారి కోసమే..
X

న్యూఢిల్లీ: హిల్ స్టేషన్ ప్రాంతాల్లో, మార్కెట్లలో కొవిడ్ నిబంధనలు మరిచి ప్రజలు భారీ ఎత్తున గుమిగూడుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. థర్డ్‌వేవ్‌‌ను పారదోలేందుకు కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ మంగళవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వల్ల పర్యాటక రంగం, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నది నిజమే.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు ధరించడకుండా హిల్ స్టేషన్లలో, మార్కెట్లలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటం మాత్రం సరైందికాదు. వైరస్ దానంతట అదే వచ్చిపోదు. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు మనమే దాన్ని వెంట తెచ్చుకుంటాం’ అని తెలిపారు. థర్డ్ వేవ్‌‌ను ఆపేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరముందని, ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సీఎంలకు సూచించారు. అలాగే, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్దేశించారు.

దేశం మొత్తంలో 73జిల్లాల్లో 10శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉండగా, అందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే 47జిల్లాలున్నాయని తెలిపిన ఆయన.. దీని కట్టడిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మైక్రో-కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసి, కఠిన ఆంక్షలు విధించాలని నిర్దేశించారు.


Next Story