పంట పాయే.. అప్పులు మిగిలే

by  |
పంట పాయే.. అప్పులు మిగిలే
X

దిశ, అచ్చంపేట : అధిక వర్షాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట డివిజన్‌లో చాలా మంది రైతులు ప్రభుత్వ సూచన మేరకు పత్తి పంట సాగుచేశారు. వర్షాల వల్ల పత్తి పంట నీటి పాలవడంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకే పత్తి సాగు చేశామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ సూచన మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సుమారు లక్ష 87 వేల 938 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. వర్షాల కారణంగా సుమారు లక్ష ఎకరాలు నీటిపాలయ్యాయి. నియోజక వర్గం‌లోని లింగాల, బల్మూరు, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర, చారగొండ, వంగూరు మండలాల్లో పత్తి పంట ఎక్కువ శాతం నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు తీరేదెలా?

వర్షాకాలం మొదట్లో వర్షాలు ఆశాజనకంగా కురవడంతో రైతులు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. చేతికొచ్చే సమయంలో ప్రస్తుతం భారీ వర్షాల కురుస్తుండటంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నిరాశకు గురైన రైతులు.. అప్పులు ఎలా తీర్చాలే తెలియక సతమతమవుతున్నారు. అధికారులు స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని.. దీని వల్ల అప్పుల నుంచి తమకు కాస్త ఉపశమనం లభిస్తుందని అన్నదాతలు కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కష్టం నీటి పాలు

అచ్చంపేట డివిజ్‌లో లక్ష 87 వేల 938 ఎకరాల్లో అన్నదాతలు పత్తి పంట సాగుచేశారు. అధిక వర్షాల కారణంగా వీటిలో సుమారు లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అచ్చంపేటలో 39,660 ఎకరాలు, అమ్రాబాద్‌లో 18,583 ఎకరాలు, పదర‌లో 14,176, లింగాలలో 11,572, ఉప్పునుంతలలో 35,883, వంగూరులో 38,583 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అందులో సగానికి పైగా పంట నీటిపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసినప్పటి నుంచి అనేక శ్రమకోర్చి చివరి వరకు కంటిరెప్పాలా కాపాడుకున్నాడు. విత్తనాల నుంచి మొదలుకుని పంట చేతికి వచ్చే వరకు అనేక రకాలుగా పెట్టుబడి పెట్టి రక్షించుకున్నారు. కానీ చివరకు ఆ పంట భారీ వర్షాల కారణంగా నాశనం కావడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

నాలుగు ఎకరాల పంట నీటి పాలు : మల్లయ్య, వంకేశ్వరం గ్రామం

నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. భారీ వర్షాల కారణంగా పంట పూర్తిగా నీట మునిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

అప్పు చేసి మరీ సాగు : రాజు, పదర

మొదట్లో వర్షాలు ఆశాజనకంగా పడటంతో అప్పు చేసి మరీ పత్తి పంట సాగుచేశాను. దిగుబడి బాగా వస్తుందనుకున్నాను. భారీ వర్షాలు కురవడం వల్ల పంట మొత్తం దెబ్బతిన్నది. పంట కోసం చేసి అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.

ప్రభుత్వం పరిహారం చెల్లించాలి : శంకర్ యాదవ్

8 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షాలకు నీట మునిగింది. పంట కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.

Next Story

Most Viewed