విజయవాడ To కొండాపూర్.. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్, MDMA స్వాధీనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-17 03:05:42  IST  )

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

విజయవాడ To కొండాపూర్.. డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్, MDMA స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: యువతే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ ప్రాంతమైన కొండాపూర్‌లో డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్ముతున్న ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు మెరుపు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి డ్రగ్స్‌ను సేకరించి హైదరాబాద్‌కు తరలిస్తోంది. ముఖ్యంగా కొండాపూర్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని యువతకు, ఐటీ ఉద్యోగులకు ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురిపై కేసు.. ఇద్దరి అరెస్ట్

ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో వీరికి డ్రగ్స్ ఎక్కడ నుంచి అందుతున్నాయి.. నగరంలో ఇంకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ హబ్‌గా ఉన్న కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Next Story