రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రూ.33 లక్షల మోసం వెలుగులోకి

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-12 06:35:07  IST  )

రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి శ్రీధర్ బాబు ఆత్మహత్య కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రూ.33 లక్షల మోసం వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి కలెక్టరేట్‌ (Ranga Reddy Collectorate)లో ఉద్యోగిగా పనిచేసిన శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అతడిది సాధారణ ఆత్మహత్యగా భావించినా.. కేసు దర్యాప్తులో మాత్రం భారీ ఆర్థిక అక్రమాల కోణం బయటపడినట్లుగా తెలుస్తోంది. అధికారిక వర్గాల సమాచారం మేరకు.. జూన్ 1న శ్రీధర్ బాబు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన విచారణలో భాగంగా శ్రీధర్ బాబు సుమారు రూ.33 లక్షల ప్రభుత్వ నిధులు మళ్లించినట్లుగా తెలుస్తోంది. జిల్లా ట్రైబల్ శాఖకు సంబంధించిన నిధులను అక్రమంగా ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంతకం ఫోర్జరీ.. మూతపడిన ఖాతా రీ-ఓపెన్

దర్యాప్తులో భాగంగా, జిల్లా ట్రైబల్ అధికారిణి (District Tribal Officer) సంతకాలను శ్రీధర్ బాబు ఫోర్జరీ చేసి నిధులు స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం ఆడిట్‌లో బయటపడే అవకాశం ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న నలుగురు తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank) మేనేజర్లపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అందులో శంషాబాద్, హస్నాపూర్, పీర్జాదిగూడ, భువనగిరి శాఖల మేనేజర్లు ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు పదేళ్లుగా మూతపడిన బ్యాంకు ఖాతాను తిరిగి రీ-ఓపెన్ చేసి అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ నిధుల మళ్లింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, వారి సహకారం ఎంత వరకు ఉంది అనే కోణంలో కూడా విచారణ లోతుగా కొనసాగుతోంది.

Next Story