పోలీసుల కస్టడీలో వ్యక్తి మృతి పట్ల తీవ్ర అనుమానాలు

by Disha Web Desk 12 |
పోలీసుల కస్టడీలో వ్యక్తి మృతి పట్ల తీవ్ర అనుమానాలు
X

దిశ, సికింద్రాబాద్: చోరీ కేసులో పట్టుబడి తుకారాం గేట్ పోలీస్ కస్టడీలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, ఫిట్స్ రావడం కారణంగానే చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులే కొట్టి చంపారని తమకు న్యాయం చేయాలని మృతుని బంధువులు గాందీ ఆసుపత్రి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూపేష్ నగర్‌లో నివాసం ఉండే ఆమూరి చిరంజీవి (30)ని మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు తాము ఎల్బీనగర్ పోలీసులమని పరిచయం చేసుకొని చిన్న కేసు ఉంది, విచారణ జరిపి పంపిస్తామని తీసుకెళ్లారు.

అనంతరం కుటుంబసభ్యులు ఎల్బినగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ చిరంజీవి లేడని, ఇక్కడికి ఎవరికి తీసుకరాలేదని చెప్పడంతో తిరిగి వెళ్ళిపోయారు. మంగళవారం రాత్రి. పన్నెండు గంటల సమయంలో పోలీసులు ఫోన్ చేసి చిరంజీవి చనిపోయాడు. గాంధీ ఆస్పత్రిలో బాడీ ఉందని, అక్కడికి రావాలని చెప్పారు. రాత్రి నుంచి బాడీని చూపించడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని గాందీ ఆసుపత్రి ఎదుట మృతుని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీనిపై తుకారాం గేట్ పోలీసులను వివరణ కోరగా, మొబైల్ చోరీ కేసులో మంగళవారం సాయంత్రం తీసుకువచ్చాము. ఫిట్స్ రావడం తో గాంధీ ఆసుపత్రికి తరలించాము. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు.



Next Story