భర్తను కొట్టి నడిరోడ్డుపై భార్య వస్త్రాలు చింపేసిన దుర్మార్గులు

by Disha Web Desk |
భర్తను కొట్టి నడిరోడ్డుపై భార్య వస్త్రాలు చింపేసిన దుర్మార్గులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్థరాత్రేకాదు.. పట్టపగలు కూడా మహిళలకు రక్షణ కరువైంది. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు.. భర్తతో కలిసి రోడ్డుపై వెళ్తున్నా ఆకతాయిల వేధింపులు మాత్రం తప్పడం లేదు. ఓ కుటుంబం రోడ్డుపై వెళ్తుండగా గంజాయి మత్తులో యువకులు బైక్‌పై వచ్చి వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో భర్త వారిని హెచ్చరించగా మరింతరెచ్చిపోయారు. అంతేకాదు.. అతడి భార్య ఒంటిపై ఉన్న దుస్తులు చించేసి అవమానించారు. అడ్డుకున్న భర్త, ఆమె తమ్ముడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పూర్ణామార్కెట్ రంగిరీజు వీధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఈనెల 15న దంపతులు తమ ఆరేళ్ల కుమార్తెతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. షాపింగ్ ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అప్పటికే ఫుల్‌గా మద్యం తాగి, గంజాయి సేవించిన ఇద్దరు ఆకతాయిలు బైక్‌పై వీళ్లను వెంబడించారు. ఆరేళ్ల చిన్నారి వద్దకు వచ్చి గట్టిగా హారన్ కొట్టారు. దీంతో ఆ చిన్నారి హడలిపోవడంతో తండ్రి ఆ యువకులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. అతడిపై దాడి చేయడంతోపాటు భార్యపైనా అసభ్యకరంగా ప్రవర్తించారు. దుస్తులు చింపేశారు. దీంతో ఆమె తన సోదరుడికి ఫోన్ చేసి విలపించింది. దీంతో అతడు అక్కడికి రాగా అతడిపైనా ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ, పలు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీర్రాజు, సంపత్‌లను నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.



Next Story

Most Viewed