కన్నతండ్రినే హతమార్చిన కసాయి కొడుకు

by Disha Web Desk 1 |
కన్నతండ్రినే హతమార్చిన కసాయి కొడుకు
X

ఆస్తి తగాదాలతో ఇద్దరి మధ్య వాగ్వాదం

ఆరు గంటల్లో హత్య కేసును చేధించిన పోలీసులు

దిశ గాంధారి/ఎల్లారెడ్డి : కన్నతండ్రిని కన్న కొడుకే కడతేర్చిన ఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. ఆస్తిపాస్తులే.. ముఖ్యమని మానవ సంబంధాలను మంటగలిపిన ప్రత్యక్ష నిదర్శనం ఈ ఘటన. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి ప్రముఖ వస్త్ర వ్యాపారి జడే తుకారాం (75)కు జాడే కిషోర్ అనే కొడుకు ఉండేవాడు.

తండ్రీ, కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు ఉండడంతో చాలా ఏళ్ల నుంచి కిషోర్ తన భార్య, పిల్లలతో హైదరాబాద్ లో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ కొన్నేళ్లు అక్కడే గడిపాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తండ్రిని ఆశ్రయించాడు. తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడు ఆస్తి గొడవలు ఉండేవి. తన కొడుకు ప్రావర్తనపై నమ్మకం లేక ఆదివారం తన ఇంట్లో ఉండొద్దని వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆగ్రహించిన కిషోర్ తండ్రిని కొట్టగా తుకారాం కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు.

వెంటనే కిషోర్ అంబులెన్స్ ను పిలిపించి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే, అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి కిషోరే తన తండ్రి తుకారాంను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయం ఎల్లారెడ్డిపట్నంలో దావానంలా వ్యాపించింది. తుకారాం ముఖంపై ఉన్న గాయాలు చూసి హత్య జరిగిందనే ప్రచారం కాస్త పోలీసుల వద్దకు చేరింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి జాగిలాలను తీసుకురాగా అవి కొడుకు కిషోర్ వద్ద ఆగిపోయాయి.

తుకారాంది సహజ మరణం కాదని హత్యగా చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఆధారాలతో కొడుకును నిలదీయగా తండ్రిని హత్య చేసింది తనేనని కిషోర్ ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే హత్య కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.

Next Story

Most Viewed