రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-21 02:47:40  IST  )

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి కాలిబూడిదైంది.

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిబూడిదైన ఘటన విజయనగరం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. రామభద్రపురం మండల పరిధిలోని తారాపురం వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే, ఈ బస్సు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దారి మధ్యలో బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ క్రమంలోనే టైర్ రిమ్ రోడ్డుకు రాజుకుని వెలువడిన నిప్పురవ్వలు క్షణాల్లో బస్సు అంతటా వ్యాపించి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి, అందులోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. దీంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక చెలరేగిన మంటల కారణంగా బస్సు కాలిబూడిడైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story