డివైడర్ ను ఢీ కొని యువకుడు మృతి..

by Disha Web Desk 20 |
డివైడర్ ను ఢీ కొని యువకుడు మృతి..
X

దిశ, భూదాన్ పోచంపల్లి : పెద్దరావులపల్లి బ్రిడ్జి వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ కు ఢీ కొని యువకుడు మృతి చెందిన సంఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో శనివారం చోటుచేసుకొంది. కుటుంబ సభ్యులు స్థానిక ఎస్సై సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన తప్పటి ఉమేష్ (24) శనివారం మధ్యాహ్నం బట్టుగూడెం నుండి పెద్దరావులపల్లికి పల్సర్ బైక్ మీద వస్తుండగా పెద్దరావులపల్లి బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ కు ఢీకొని పక్కనున్న మిషన్ భగీరథ పైప్ లైన్ పై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యి రక్తస్రావంలో ఉన్న క్షత గాత్రున్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే హుటాహుటిన పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ లో ఉమేష్ ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కాగా మృతుడు ఉమేష్ తల్లితండ్రులకు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు మరణవార్తతో వారి కన్నీటి ఆర్తనాదాలు మిన్నంటాయి. చేతికందిన కొడుకు కళ్ళ ముందే శవంగా మారటంతో తల్లితండ్రులు సోదరీమణులు గుండెలవిసేలా రోదించారు. మృతునికి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. ఉమేష్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇంకా పెళ్లి కాలేదు. తోటి స్నేహితులు, గ్రామస్తులు, మొత్తం గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సైదిరెడ్డి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed