చెరువులో పడి యువకుడు మృతి

by Nallavelli.Anjaneyulu |

చెరువులో ప‌డి మ‌తి స్థిమితం స‌రిగ్గా లేని యువ‌కుడు మృతి చెందిన సంఘ‌ట‌న లింగంపేట మండ‌ల ప‌రిధిలోని కోమ‌టిప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

చెరువులో పడి యువకుడు మృతి
X

దిశ, తాడ్వాయి(​లింగంపేట): ​ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన లింగంపేట్ మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దీపక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోమటిపల్లి గ్రామానికి చెందిన ధరణి నవీన్ (18) గత కొంతకాలంగా మతి స్థిమితం సరిగ్గా లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. 11 ఏళ్ల క్రితం తండ్రి విద్యుదాఘాతంతో మరణించగా.. తల్లి కూలీ పనులు చేస్తూ అతడిని పోషిస్తోంది. సోమవారం తల్లి పని నిమిత్తం కామారెడ్డికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చేసరికి నవీన్ ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన గంపల తిరుపతి గ్రామ చెరువు కట్ట పై నవీన్ చెప్పులను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని చెరువులో గాలించగా నవీన్ మృత దేహం లభ్యమైంది.​ మతిస్థిమితం లేని నవీన్, కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. కుమారుడి మృతి పై ఎలాంటి అనుమానాలు లేవని ఆమె తెలపడంతో మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్ల‌డించారు.

Next Story