చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..

by Disha Web Desk 20 |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం జప్తి జాన్కంపల్లి గ్రామానికి చెందిన కోరబోయిన శంకరయ్య ( 40 ) అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ, అప్పుడప్పుడు చెరువులో చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు గ్రామ శివారులోని మల్లాడి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదన్నారు.

శంకరయ్య భార్య విజయ మల్లాడి చెరువు కట్టపై వెతకగా, చెరువుకట్ట పై శంకరయ్య బట్టలు కనిపించాయని, దీంతో బుధవారం ఉదయం గ్రామస్తులు జాలర్ల సహాయంతో సుమారు ఐదు గంటల పాటు చెరువులో గాలించగా శంకరయ్య మృతదేహం దొరికిందని, శంకరయ్య కాళ్లకు వల చుట్టుకుని, ఈత రాకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో, పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతునికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.



Next Story

Most Viewed