AP: స్కార్పియోలో దొంగల ఛేజింగ్.. ప్రైవేటు బస్సులో 2.750 కేజీల బంగారం చోరీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-21 05:12:16  IST  )

స్కార్పియోలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును దొంగలు ఛేజ్‌ చేసి ఫిల్మీ స్టైల్‌లో దోపిడీకి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ హైవేపై చోటుచేసుకుంది.

AP: స్కార్పియోలో దొంగల ఛేజింగ్.. ప్రైవేటు బస్సులో 2.750 కేజీల బంగారం చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ సీన్‌ను తలపించేలా దొంగలు స్కార్పియో కారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఛేజ్ చేసి ఏకంగా రూ.4.50 కోట్ల విలువైన 2.750 కేజీల బంగారాన్ని అపహరించుకుపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల (Nandyal) జిల్లా డోన్ హైవేపై శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ మొత్తంలో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన దొంగల ముఠా.. అనంతపురం (Anantapur) నుంచే ఓ స్కార్పియో కారులో ఆ ప్రైవేట్ బస్సును క్లోజ్‌గా ఫాలో చేస్తూ వచ్చింది. బస్సు నంద్యాల జిల్లా డోన్ హైవేపై ఉన్న ‘భారత్ డాబా’ దగ్గరకు రాగానే దొంగలు తమ ప్లాన్ అమలు చేశారు. బస్సు ఆగడం, ప్రయాణికుల కదలికలను ఆసరాగా చేసుకుని అత్యంత చాకచక్యంగా బంగారం ఉన్న బ్యాగ్‌ను అపహరించుకుని స్కార్పియోలో పరారయ్యారు.

జడ్చర్లకు వెళ్లేసరికి దొంగతనం వెలుగులోకి..

బస్సు డోన్ దాటి తెలంగాణలోని జడ్చర్ల (Jadcharla)కు చేరుకున్న తర్వాత బాధితుడు మోతిలాల్ తన బంగారం బ్యాగ్‌ను చెక్ చేసుకున్నాడు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. బ్యాగ్ కనిపించకపోవడంతో షాక్‌కు గురైన బాధితుడు, లబోదిబోమంటూ వెంటనే వెనక్కి తిరిగి వచ్చి డోన్ పోలీస్ స్టేషన్‌ (Done Police Station)లో ఫిర్యాదు చేశాడు. మాయమైన బంగారం విలువ సుమారు రూ.4.50 కోట్లు అంటే 2.750 కేజీలు ఉంటుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోతిలాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన డోన్ పోలీసులు చోరీ జరిగినట్లు భావిస్తున్న డోన్ హైవేలోని భారత్ డాబా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘరానా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story