'ఇఎస్ఐ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి'

by  |
ఇఎస్ఐ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో ఇఎస్ఐ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 13 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు రాశిన బహిరంగ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్, రామచంద్రాపురంతో పాటు సంగారెడ్డి, కాగజ్‌నగర్, కొమరం భీం అసిఫాబాద్‌లోని ఇఎస్ఐ డిస్పెన్సరీల్లో 120 మంది శానిటేషన్ కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి 2019 మార్చి నుంచి యాజమాన్యం వేతనాల చెల్లింపును నిలిపివేసిందని.. అయినా వీరి సేవలను మాత్రం రెగ్యులర్‌గా వినియోగించుకుంటున్నదని పేర్కొన్నారు. వేతనాలు ఇవ్వకున్నా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నారని తెలిపారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించవలసిందిగా చాడ వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌ను లేఖలో కోరారు.

Tags: ESI Contract employees, Chada Venkat Reddy, Corona, Pending Salaries

Next Story

Most Viewed