కొవిడ్ శవాల అంత్యక్రియలకు రూ. 30 వేలు

by  |
కొవిడ్ శవాల అంత్యక్రియలకు రూ. 30 వేలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తాజాగా సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ వైకుంఠధామం వెహికల్ డ్రైవర్ రూ. 30 వేలు ఇస్తేనే చివరి కార్యక్రమాలు చేస్తానని స్పష్టం చేశాడు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకడంతో సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. శవానికి అంత్యక్రియలు చేయడానికి వైకుంఠధామం వెహికల్ డ్రైవర్ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 18 వేలు అకౌంట్ కు పంపిన తర్వాతే అంత్యక్రియలు చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

కరోనాతో చినపోయిన మృతదేహాలను ఖననం చేయాలంటే వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడు మరణించాడన్న బాధకన్నా శవాన్ని దహనం చేయించేందుకు పడుతున్న బాధలే వారిని ఎక్కువగా వెంటాడుతున్నాయి. కరోనా సోకుతుందన్న భయంతో కుటుంబీకులు శవాన్ని కూడా చూసేందుకు రావడం లేదు. ఇదే అదనుగా భావించిన పలువురు నిలవు దోపిడీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేయాలంటే రూ. 30 వేలు నిర్ణయించుకుని వసూలు చేస్తున్నారు.

అన్ని చోట్లా ఇవే పరిస్థితులు!

కరీంనగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ కరోనా మృతదేహాల ఖననానికి ఫిక్స్‌డ్ రేట్ ఇస్తేనే వస్తామని తెగేసి చెప్తున్నారు. రూ. 30 వేలు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని తేల్చి చెప్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ సిటీలోని ఓ వృద్ధాశ్రమంలో కరోనా బాధితులు వెలుగులోకి వచ్చారు. దీంతో మిగతా వారిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు వసూలు చేశారని ప్రచారం జరిగింది. ప్రైవేటు వ్యక్తులు కూడా దర్జాగా ఈ దందా కొనసాగిస్తున్నారు. వీఆర్ స్పెషల్లీ ఫర్ కరోనా విక్టిమ్స్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కరోనా బాధితులను ఆస్పత్రికి తరలించాలన్నా, శవాలను తీసుకెళ్లాలన్నా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కరోనాకు ముందు పేషెంటును హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటే రూ. 6 నుంచి 8 వేల వరకు అంబులెన్స్ నిర్వాహకులు తీసుకునేవారు. ఇప్పుడు రూ. 30 వేల వరకూ వసూలు చేస్తున్నారంటే కరోనా పేషెంట్ల నుంచి ఎంత దోపిడీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.



Next Story

Most Viewed