కేరళలో తోకముడుస్తున్న కరోనా!

by  |

దిశ, వెబ్‌డెస్క్: మనదేశంలో మొట్టమొదటి కరోనా కేసు రిపోర్ట్ అయిన స్టేట్ కేరళ. గత నెల వరకూ అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో కేరళ తొలివరుసలో ఉన్నది. మార్చి చివరి వారం వరకూ మహారాష్ట్ర, కేరళల్లోనే ఎక్కువ కేసులున్నాయి. కానీ, ఇప్పుడు కేరళలో పరిస్థితులు మెరుగైనట్టు కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండగా కేరళలో మాత్రం తగ్గుముఖం పట్టింది. దేశంలో రోజుకు కొత్తగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కరోనా కేసులు నమోదవుతుండగా కేరళలో మాత్రం సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుండడం గమనార్హం. ఈ రాష్ట్రంలో రికవరీ అవుతున్న పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం ఆసక్తికర విషయమని చెప్పవచ్చు.

పది రోజుల్లో 90 కేసులు

కేరళలో ఈ నెల మొదటి నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు అంటే పది రోజుల్లో ఆరు రోజులు కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఈ పది రోజుల్లో మొత్తం 90 కేసులే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ కాలంలో సుమారు 6,700 కేసులు రిపోర్ట్ కావడం గమనార్హం. కేరళలో కొత్త కేసులు చాలావరకు తగ్గిపోతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో నమోదైన చాలా కేసులు విదేశాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చినవారందరూ క్వారంటైన్‌లో ఉన్నారని, సాధారణంగా వైరస్ లక్షణాలు బహిర్గతమయ్యే వ్యవధి దాదాపుగా నిండుకున్నదనీ వివరించారు. విదేశాల నుంచి వచ్చినవారితో కాంటాక్ట్‌లోకి వెళ్లినవారిపైనే ఇప్పుడు దృష్టి పెట్టామని చెప్పారు. వీరి శాంపిళ్ల టెస్టులకు సంబంధించిన ఫలితాలు వారం రోజుల్లో అందవచ్చని వివరించారు. కాగా, హాట్‌స్పాట్‌లలోనూ కేసులు స్వల్పంగానే నమోదవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక సంక్రమణ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు.

48 శాతం రికవరీలు

దేశవ్యాప్తంగా 9,152 కేసులు నమోదవ్వగా 857 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. కేరళలో ఈ రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మొత్తం 376 కేసులకుగాను రికవరీ అయినవారి సంఖ్య 179కి చేరింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 36 మంది పేషెంట్లు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ కేసులు సోకినవారితో పోల్చితే ఇంచుమించు తొమ్మిది శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 48 శాతంగా ఉన్నది. అయితే, కేరళ కంటే మహారాష్ట్రలో రికవరీ అయినవారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నది. అక్కడ రికవరీ అయినవారి సంఖ్య 217గా ఉన్నా కేసుల సంఖ్య దాదాపు కేరళ కంటే ఐదు రెట్లకు మించి(1,985) ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా రికవరీ అవుతున్నవారిలో 18 శాతం కేరళ నుంచే ఉన్నారు(ఆదివారంనాటికి). కాగా, మొత్తం కరోనా కేసుల్లో నాలుగు శాతం మాత్రమే కేరళ నుంచి ఉన్నాయి. దేశంలో 308 మంది మరణించగా.. ఈ రాష్ట్రంలో ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేసులు తగ్గుముఖం పట్టడంపై స్పందిస్తూ.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలన్నింటినీ పటిష్టంగా అమలుపరుస్తున్నట్టు రాష్ట్ర అధికారులు తెలిపారు. గుర్తించిన హాట్‌స్పాట్‌లలోనూ కఠిన నిబంధనలను అమలుచేస్తున్నట్టు వివరించారు. కేసులు తగ్గుతున్నాయని ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించబోమని చెప్పారు. లాక్‌డౌన్ తర్వాత కూడా అసలు సవాల్ ఎదుర్కోవాల్సే ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాల్లో చిక్కుకున్న కేరళీయులు లాక్‌డౌన్ తర్వాత తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. కాబట్టి లాక్‌డౌన్ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు.

Tags: kerala, differnect, trend, fall down, coronavirus, intensity

Next Story