ఆ దేశాల్లో కరోనా ప్రభావం శూన్యం..

by  |
ఆ దేశాల్లో కరోనా ప్రభావం శూన్యం..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాలు నేడు కరోనా మహమ్మారి బారిన పడి అతలాకుతలం కావడానికి ప్రధాన కారణం చైనా దేశం. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా పరిణమించింది. గతేడాది చివర్లో చైనాలో అల్లకల్లోలం సృష్టించిన ఈ వైరస్, 2020 జనవరి నుంచి ఇతర దేశాలపై తీవ్రంగా పడింది. ఇప్పటివరకూ కోటికి పైగా కేసులు, 6 లక్షలకు పైగా మరణాలతో ప్రపంచం తల్లడిల్లిపోతోంది. అయితే, కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ దేశాల్లో నిజంగానే కరోనా లేదని అమెరికా కూడా అధికారికంగా గుర్తించింది. ఈ దేశాల్లో చాలావరకు పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశాలే కావడం విశేషం.

ఆ దేశాలు ఇవే..

సోలోమన్ ఐలాండ్స్
వనెవాటు
మైక్రోనేషియా దీవుల సమాఖ్య
మార్షల్ దీవులు
పలావ్
తువాలు
ఉత్తర కొరియా
నౌరు
తుర్క్ మెనిస్థాన్
సమోవా
కిరిబాటి
టోంగా

పక్కనే ఉన్న చైనాలో కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలియగానే ఉత్తర కొరియా సరిహద్దులు పూర్తిగా మూసేసి కరోనా తమ దేశంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడింది. తుర్క్ మెనిస్థాన్ విషయానికొస్తే ఆరంభంలోనే చైనాకు విమానాలు రద్దు చేసింది. అన్ని దేశాలతో ఉన్న సరిహద్దులు మూసేసి తన ప్రజలను రక్షించుకుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పసిఫిక్ ద్వీప దేశాల గురించే. విదేశాల నుంచి వచ్చేవారికి ఈ దేశాలు కఠిన నిబంధనలు అమలు చేశాయి. కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోవడం, ఆపై డాక్టర్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి వంటి నిబంధనలతో కరోనాను ఆమడదూరం పెట్టాయి. ప్రధానంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయడం ఈ దేశాలను వైరస్ కు దూరంగా నిలిపింది. ఈ పసిఫిక్ ద్వీపదేశాల్లో జనాభా తక్కువగా ఉండడం కూడా అక్కడి ప్రభుత్వాలకు సేవలు అందించేందుకు సులువుగా మారింది.



Next Story