కరోనాకు చికిత్స ఈజీ.. ఎలాగంటే..?

by  |
కరోనాకు చికిత్స ఈజీ.. ఎలాగంటే..?
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా సమాజ జీవన గమనాన్నే మార్చేస్తోంది. దాని గురించిన చర్చే అంతటా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కరోనా పాజిటివ్‌ వచ్చినవారి వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో తిండి పెట్టడం లేదని ఒకరు, శ్వాస కూడా కషష్టమవుతోందని.. ఆక్సిజన్ పెట్టడం లేదని ఇంకొకరు, నాన్నా క్షమించు అంటూ మరొకరు పోస్టిగులు పెడుతున్నారు. దీంతో సమాజం మరింత ఆందోళనకు గురవుతోంది. కరోనా పాజిటివ్ వస్తే జీవితమే వృథా అన్న భావనకు పలువురు వచ్చేస్తున్నారు. నలుగురు ఏం అనుకుంటారోనన్న ఆందోళన. బంధుమిత్రులు దూరం చేస్తారన్న కలవరం. కుటుంబం ఏమవుతుంది? అనే భయాలే అందరినీ వెంటాడుతున్నాయి. అనుమానితుల పట్ల సమాజం వైఖరి మారాలి. వాళ్ల గురించి మాట్లాడుకునే విధానం, చూసే విధానం మారాలి. సమాజం ధోరణితోనే బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటివి వదిలేస్తేనే కరోనా వైరస్ ఎదుర్కోగలమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతి బెడ్ కోవిడ్-19 కాదు

‘‘లక్షణాలు కనిపించినా టెస్టులకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఆయాసం ఎక్కవైన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. పాజిటివ్ అనగానే భయపడుతున్నారు. ఆసుపత్రిలో బెడ్ లేదనగానే ఆందోళన, భయంతో కుప్పకూలుతున్నారు’’ అని ఉస్మానియా ఆసుపత్రి చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డా.అనురాధ చెప్పారు. అదే ముందే వస్తే బాగుంటుందని ఆమె సూచించారు. ‘‘వైరస్లో చనిపోయేంత తీవ్రత లేదు. భయంతోనే శరీరంలో రియాక్షన్స్ ఎక్కవగా ఉంటున్నాయి. దీంతో గుండెనొప్పి, రక్త ప్రసరణ నిలిచిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్స్ లేవన్న ప్రచారం కూడా భయపెడుతోంది. అందుకే జ్వరం, జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలతో ఆసుపత్రికి వస్తే అదే కారణాన్ని చూపిస్తున్నారు. ఏండ్ల తరబడి గుండె జబ్బులతో బతుకుతున్నారు. ఈ కరోనా వైరస్ ను ఎదుర్కోలేమా అని’’ డా.అనురాధ ప్రశ్నించారు.

కౌన్సెలింగ్ ఇస్తున్నాం

‘‘కరోనాను నియంత్రించేందుకు మందులు లేకపోవచ్చు. ఆత్మస్థెర్యం ఉంటే పాజిటివ్‌ వచ్చినా ఏమీ కాదు’’ అని గాంధీ ఆసుపత్రి కరోనా విభాగంలో విధులు నిర్వహిస్తున్న పేషెంట్‌ కౌన్సెలింగ్‌, ఎడ్యుకేషన్‌ కమిటీ సభ్యురాలు, సైకియాట్రిస్టు డా.పింగళి శ్రీలక్ష్మి చెబుతున్నారు. ’’బాధితుల మానసిక పరిస్థితిని అంచనా వేసి ధైర్యంగా ఉండేందుకు శ్రమిస్తున్నాం. ఎప్పుడు సైకియాట్రిక్‌ అవసరమొచ్చినా వెంటనే కాల్‌ చేస్తున్నాం. ఫోన్‌లోనే కౌన్సిలింగ్‌ మొదలు పెడతారు. ఐనా వారు మానసికంగా కోలుకునేటట్లు లేకపోతే రోగితో ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడుతున్నాం. వారి భయాందోళనలను పోగొట్టి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆమె వివరించారు. అనుమానితులకు చికిత్స కంటే మానసిక ఆనందమే ప్రధానమని, అదే వారిని కాపాడుతుందని అన్నారు. ప్రతి రోజూ నలుగురైదుగురు సీరియస్‌ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వాళ్లలో చాలా మంది తమ కుటుంబాల గురించే ఆలోచిస్తున్నారని డా. శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

అక్కడా అబద్ధాలే

ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు డాక్టర్ దగ్గరికి వచ్చినా అబద్ధాలే చెబుతున్నారని, లక్షణాలను సరిగ్గా చెప్పకుండా తప్పించుకుంటున్నారని వివేకానంద మెడికల్ సెంటర్ ఎండీ డా.కె రమేష్ సాగర్ చెప్పారు. ‘‘ఇటీవల యాదాద్రి జిల్లా నుంచి ఓ పేషెంట్ వచ్చాడు. కేవలం జ్వరం వచ్చిందని, అది కూడా రెండే రోజులైందని చెప్పారు. లక్షణాలు కరోనా వైరస్గా కనిపించాయి. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాను. వాళ్లేమో దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా అదే సమాధానం వచ్చింది. దాంతో కొన్ని గంటలు గడిచాయి. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడు’’ అని ఆయన వివరించారు. మరో నాలుగైదు కేసుల్లోనూ ఎన్ని రోజుల నుంచి బాధ పడుతున్నారో కూడా దాచి పెట్టారన్నారు. ఈ భయాన్ని అధిగమించాలని ఆయన సూచించారు.

కరోనా నియంత్రణకు ఇలా చేయాలి

– వాస్తవాన్ని అంగీకరించాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలో నేనూ ఒక్కడిని అని భావించాలి
– ప్రమాదమొస్తే ఎదుర్కొవాలి. పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయం వీడాలి
– భౌతిక దూరం పాటించాలి. ఆత్మీయతను ప్రదర్శించాలి
– రోజూ వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి

Next Story

Most Viewed