పాఠశాలల్లో నిర్లక్ష్యం వహిస్తే ముప్పు తప్పదు

by  |
Students
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాఠశాలలు ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పిల్లల విషయంలో అత్యంత కేర్ ఉండాలన్నది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. చిన్నారుల్లో వైరస్ వ్యాప్తి జరిగితే ఎక్కువ మందికి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలు రీసెర్చ్ లు స్పష్టం చేస్తున్నట్లు ప్రభుత్వానికి తెలిపారు. అంతేగాక మెడికేషన్ విధానంలో కూడా చాలా మార్పులు ఉంటాయన్నారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలన్నది.

గతేడాది స్కూళ్ల ద్వారానే వ్యాప్తి…

గతేడాది చాలా మంది చిన్నారులకు స్కూళ్ల ద్వారా వ్యాప్తి జరిగిందని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి వెల్లడించింది. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ప్రతీ స్కూళ్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నది. ప్రైవేట్ లో ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ, గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బెటర్ అని వివరించింది. అంతేగాక ప్రతీ తరగతి గదిలో కేవలం 50 శాతం మాత్రమే సీటింగ్ విధానం ఉండాలన్నది. దీంతో పాటు ప్రతీ సర్కార్ పాఠశాలకు మాస్కులు, శానిటైజర్లను కూడా సమకూర్చాలన్నది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు వైద్యశాఖ వ్యాక్సిన్ పంపిణీ చేసిందని, ఈ క్రమంలో టీచర్లకూ కొంత వరకు రక్షణ లభిస్తుందని పేర్కొంది. అయితే ఇప్పటికీ టీకా తీసుకోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వెంటనే వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యశాఖ వెల్లడించింది.

డాక్టర్లును అందుబాటులో ఉంచాలి..

ప్రతీ స్కూల్లో మెడికల్ రూమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ప్రభుత్వానికి వివరించింది. అంతేగాక అందుబాటులో ఉన్న డాక్టర్ ను సమన్వయం చేసుకునేలా స్కూళ్లకు నిబంధనలు పెట్టాలన్నది. లక్షణాలు ఉన్న చిన్నారులను థర్మల్ స్క్రీనింగ్ అనంతరం సదరు మెడికల్ రూమ్ లో వైద్యుని పర్యవేక్షణలో ఉంచాలన్నది. దీంతో పాటు పాఠశాలలో పనిచేసే స్టాఫ్, టీచర్లు ప్రతీ పదిహేను రోజులకోసారి కరోనా టెస్టులు చేసుకోవాలన్నది. తమను సంప్రదిస్తే సదరు స్కూళ్లకు మొబైల్ వాహనాలతో కరోనా టెస్టులు చేస్తామని వైద్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది.


Next Story