కరోనా ఎఫెక్ట్.. రోడ్డున పడ్డ క్యాబ్ డ్రైవర్లు

by  |
cab-drivers
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వాహనదారుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. కొవిడ్ ఎఫెక్ట్‌తో వారి బతుకులు తిరగబడ్డాయి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య వెంటాడటంతో ఎంతోమంది తెలిసో తెలియకో పొట్ట నింపుకునేందుకు డ్రైవర్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో క్యాబ్, ఆటోలు, ఇతర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఆ వాహనాలు కొనేందుకు ఒకేసారి డబ్బులు చెల్లించేంత ఆర్థిక స్థోమత లేక ఫైనాన్స్‌లో తీసుకొని కిరాయికి తిప్పుతున్నారు. అలాంటివారి జీవితాలను కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ తీసింది. కొవిడ్‌తో కుటుంబ పోషణే భారమవుతుంటే వాహనానికి ఫైనాన్స్ డబ్బులు కట్టలేక మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా సడలించి మూడు నెలలు కావొస్తున్నా ప్రైవేట్ వాహనదారుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. దీనికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనాలు బయట తిప్పాలన్నా ఇబ్బంది పడుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు, టూర్లకు వెళ్లేవారు కరువవ్వడంతో కొనుగోలు చేసిన వాహనాల ఫైనాన్స్ చెల్లించలేక వాటి యజమానులు కష్టాలు ఎదుర్కొంటున్నారు.

హన్మకొండకు చెందిన ఒక ఆటో డ్రైవర్ బతుకుదెరువు కోసం ఆటో కొనుగోలు చేశాడు. అదే సమయంలో కొవిడ్ కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో కుటుంబ పోషణ భారమైంది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు దీనికి తోడయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా ఫైనాన్స్ డబ్బులు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అటు కుటుంబాన్ని సాఫీగా చూసుకోలేక, పెట్రోల్, డీజిల్ ఖర్చులు భరించలేక, ఫైనాన్స్ డబ్బులు చెల్లించలేక తీవ్ర మనోవేదనకు గురై ఆటోకు నిప్పంటించాడు. కూడు పెడుతుందని భావించి ఆటో తీసుకుంటే పరిస్థితులు అతడిని మరింత కష్టాల్లోకి నెట్టేశాయి.

సాధారణంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ప్రభుత్వ సబ్సిడీలుంటే కొంత ధైర్యం చేసి కొనుగోళ్లు చేస్తారు. మిగిలిన డబ్బులను ఫైనాన్స్ రూపంలో చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలించి ప్రతినెల ఫైనాన్స్ చెల్లిస్తే సరే కానీ.. అలా జరగకుంటే ఫైనాన్స్ ఇచ్చిన సంస్థలు విడిచిపెట్టవు. మొదట్లో కూల్‌గా చెప్పినా చెల్లింపుల్లో తేడా వస్తే మాత్రం వారి నుంచి వేధింపులు తప్పవు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వాలు రైతులు అరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పించకుంటే ఆవేదనతో పంటకు నిప్పు పెట్టినట్లు, తాజాగా తీవ్రంగా మనోవేదనకు గురై హన్మకొండలో ఆటోకు నిప్పంటించిన పరిస్థితి తలెత్తింది.

ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు నగరంబాట పట్టారు. స్వయం ఉపాధి పొందేందుకు కార్లు కొనుగోలు చేసి ఐటీ కంపెనీల్లో పెట్టారు. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయం నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా క్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఐటీ సంస్థలతో పాటు ఓలా, ఊబర్ క్యాబ్‌లు కూడా నడిపిస్తూ బతుకీడుస్తున్నారు. కాగా కరోనా వచ్చి క్యాబ్ డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయి. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించగా ఇంకొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోం కు అవకాశాన్ని కల్పించాయి. దీంతో ఉపాధికి దూరమై ఎంతోమంది కార్ల ఫైనాన్స్ చెల్లించలేక సమతమవుతున్నారు. దీంతో బతుకు భారమై ఆవేదనతో ఆర్థికంగా కుదేలైన కుటుంబాలు వాహనాలకు నిప్పులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జీవనం అస్తవ్యస్తమైంది : బాలు, క్యాబ్ యజమాని, వరంగల్

కరోనా వచ్చి అందరి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఆటోలు, కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు, యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల పెళ్లిళ్లు, ఇతర వేడుకలు, ఫంక్షన్లు లేకుండాపోయాయి. టూర్లకు వెళ్లేవారు కూడా తగ్గిపోయారు. గతంలో చేసినట్లుగా జనం రిస్క్ చేయడంలేదు. అందుకే ఆదాయం తగ్గిపోయింది. కుటుంబ పోషణ భారమై ఫైనాన్స్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

వ్యవసాయం చేసుకుంటున్నా : యాదయ్య, జనగామ

డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశా. ప్రభుత్వం వేయకపోవడంతో ఫైనాన్స్‌లో కార్ కొనుక్కున్నా. ఐటీ సంస్థలో ఉద్యోగుల కోసం పెట్టా. కానీ కొవిడ్ వచ్చి కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాయి. అప్పటినుంచి ఫైనాన్స్ చెల్లించలేక ఇబ్బందులుపడ్డా. చేసేదేం లేక తిరగి ఊరికొచ్చి వ్యవసాయం చేస్తున్నా.


Next Story