తెలంగాణలో కరోనా కల్లోలం.. గతేడాది రికార్డు బద్దలు

by  |
covid
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి చర్యలు ఎలా ఉన్నా కొత్త కేసులు మాత్రం వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గతేడాది సెప్టెంబరు 2వ తేదీన గరిష్ట స్థాయిలో 2,892 కొత్త కేసులు 24 గంటల వ్యవధిలో నమోదైతే ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 2,909 పాజిటివ్‌లు నమోదయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్తాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రజారోగ్య శాఖ విడుదల చేస్తున్న అధికారిక లెక్కల ప్రకారమే చూస్తే నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాల్లో గరిష్ట స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల తదితర జిల్లాల్లో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్నమొన్నటివరకూ హైదరాబాద్ నగరంతోపాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండగా ఇప్పుడు జిల్లాలకు కూడా పాకింది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉన్నామని, టెస్టులు చేస్తున్నామని, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నా కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా 202, కామారెడ్డిలో 102, జగిత్యాలలో 121 చొప్పున గడచిన 24 గంటల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక దేశం మొత్తం పరిస్థితిని చూస్తే, ఇప్పటివరకూ నమోదుకానంతటి భారీ స్థాయిలో కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. ఊహకు అందని విధంగా 1.45 లక్షల కొత్త కేసులు గడచిన 24 గంటల్లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 9న కేవలం 78 మంది మాత్రమే కరోనాతో చనిపోగా మార్చి 21 నాటికి 197కు పెరిగింది. అప్పటి నుంచి కరోనా మృతుల సంఖ్య పెరుగుతూ శుక్రవారం నాటికి 794కు పెరిగింది. కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే కాక యాక్టివ్ కేసులు, మృతుల సంఖ్య కూడా రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రత, వేగంగా చాలా ఎక్కువగా ఉండడంతో చాలా రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి విధించుకుంటున్నాయి.


Next Story

Most Viewed